గత ఎన్నికల మాదిరిగానే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఓటమిని చవిచూస్తుందని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) శనివారం అన్నారు. భారతీయ జనతా పార్టీ (BJP)పై విమర్శలు చేస్తూ, ప్రాంతీయ పార్టీలు కలిస్తే బిజెపిని ఓడించవచ్చని ఎఐఎంఐఎం చీఫ్ అన్నారు. తెలంగాణలో 2014, 2018 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది.. ఈ ఏడాది కూడా 2023 డిసెంబర్లో తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ ఓడిపోతుంది.. అందుకు కొంత క్రెడిట్ మాకు ఇవ్వండి అని ఒవైసీ అన్నారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఔరంగాబాద్ నుంచి పోటీ చేస్తామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. “వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఔరంగాబాద్, ఇతర స్థానాల నుంచి పోటీ చేస్తాం. మరికొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశాలను పరిశీలిస్తాం. వచ్చే ఎన్నికల్లో ఎవరితో కలిసి వెళ్లాలనే దానిపై వ్యాఖ్యానించడం కాస్త తొందరగా ఉందని” అని ఒవైసీ చెప్పారు.
Also Read: Student Naveen Murder Case: అమ్మాయి కోసం హత్య.. విచారణలో విస్తుపోయే విషయాలు
భివానీ హత్యపై రాజస్థాన్ ప్రభుత్వం (కాంగ్రెస్)పై AIMIM చీఫ్ విమర్శలు చేశారు. కొందరు ముస్లిం సమాజంపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. కానీ వారిపై చర్య తీసుకోదు. రాజస్థాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా భారత్ జోడో, అల్వార్లో జరిగే రాయల్ వెడ్డింగ్లో పాల్గొనవచ్చు. కానీ వారు జునైద్, నసీర్లను చంపిన ప్రదేశానికి వెళ్లలేరని విమర్శించారు. జునైద్, నాసిర్ ముస్లింలు కాకపోతే సీఎం అశోక్ గెహ్లాట్ అక్కడికి వెళ్లి ఉండేవారంటూ వ్యాఖ్యానించారు. దురదృష్టవశాత్తూ భివానీ హత్యలు జరిగినప్పుడు కాంగ్రెస్ అల్వార్ లో జరిగిన ఒక వివాహావేడకకు హాజరయ్యే పనిలో బిజీగా ఉందని విమర్శించారు.
కాగా, ఇద్దరు వ్యక్తులు జునైద్, అతని స్నేహితుడు నాసిర్ తప్పిపోయారనీ, బజరంగ్ దళ్ సభ్యులు కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ రాజస్థాన్లోని ఒక కుటుంబం ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన ఒక రోజు తర్వాత హర్యానాలోని భివానీలో కాలిపోయిన వాహనంలో కాలిపోయిన వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు కేసు నమోదుచేసుకునీ, వారు హత్యకు గురయ్యారని చెప్పారు. వీరిద్దరు గోవుల అక్రమ రవాణాకు పాల్పడ్డారనే ఆరోపణల క్రమంలో అంతకుముందు వీహెచ్ పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి.