హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో సెప్టెంబర్ 17ని ‘తెలంగాణ విమోచన దినోత్సవం’గా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రులు కూడా ఈ సభకు హాజరుకానున్నట్లు సమాచారం. 1948లో అప్పటి హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్లో విలీనమైన రోజు సెప్టెంబర్ 17.అయితే ఆ రోజుని బీజేపీ విమోచన దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది..
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించేందుకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. సాంస్కృతిక శాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సందర్భంగా సెప్టెంబర్ 17న తెలంగాణ “నిజమైన” విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటానని పదే పదే సీఎం కేసీఆర్ వాగ్దానం చేశారని.. ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని మునుగోడులో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రకటించారు.
ఏఐఎంఐఎంకు, ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి భయపడి చంద్రశేఖర్రావు ఈ అంశంపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విముఖత చూపుతున్నారని బీజేపీ పదేపదే చెబుతోంది. ఏఐఎంఐఎంను స్థాపించిన వారు హైదరాబాద్ను ఇండియన్ యూనియన్లో విలీనానికి వ్యతిరేకించిన రజాకార్లతో సంబంధం కలిగి ఉన్నారని, అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం పట్ల అప్రమత్తంగా ఉందని బీజేపీ వాదిస్తుంది