బిజెపి ఈ నెల 06 న హైదరాబాద్లోని సరూర్ నగర్లో (Saroor Nagar) భారీ బహిరంగ సభ (BJP Public Meeting) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవ కార్యక్రమాలకు (Congress Govt’s Victory Programs) వ్యతిరేకంగా నిర్వహించనున్న ఈ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నట్లు సమాచారం. ఈ సభా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, వారి పాలనలో చోటుచేసుకున్న వైఫల్యాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు సిద్ధం చేసుకుంది. తెలంగాణలో తమ రాజకీయ స్థితిని మరింత బలపర్చుకోవడం మరియు కాంగ్రెస్పై తన ప్రభావాన్ని చూపించడమే ఈ సభ ప్రధాన ఉద్దేశ్యం అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన వాగ్దానాలు, వాటిలో అమలు తీరు, సీఎం రేవంత్ (CM Revanth) తీసుకుంటున్న నిర్ణయాలపై బీజేపీ (BJP) నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు భారీ బహిరంగ సభ ద్వారా ప్రభుత్వాన్ని ఎండగట్టాలని చూస్తుంది.
ఇందులో భాగంగా ఆరు గ్యారెంటీల అమలుపై ఆదివారం చార్జ్షీట్ విడుదల చేయనుంది. రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమం ఉంటుంది. 2, 3, 4 తేదీల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు, సదస్సులు, పాదయాత్రలు నిర్వహించనున్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంస్థాగత ఎన్నికలపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ బన్సల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్కారు ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగాలు ఇచ్చింది తప్ప.. ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఈ సందర్బంగా కిషన్ రెడ్డి అన్నారు. పంచాయతీలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ సర్కారులు ఒక్క పైసా ఇవ్వలేదని అన్నారు. రుణమాఫీ కూడా అరకొరగా చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోని అహంకారం, నియంతృత్వం, అవినీతి, వైఫల్యాలు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో కూడా ఏ వర్గమూ సంతోషంగా లేదని.. రాష్ట్ర ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఉద్యమబాట పట్టాలని పార్టీ నా యకులకు కిషన్రెడ్డి (Kishan Reddy) పిలుపునిచ్చారు.
Read Also : Supreme Court Judgments : 100 ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులలో.. తెలుగు రాష్ట్రాల ఐదు కేసులివీ