మునుగోడు రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తిగా మారుతున్నాయి. ఇప్పటికే బూర నర్సయ్య గౌడ్ వ్యవహరం హాట్ టాపిక్ గా మారగా, తాజాగా మునుగోడు కాంగ్రెస్ కీలక నేత పల్లె రవి కుమార్ గౌడ్ ఆ పార్టీకి షాక్ ఇస్తూ గులాబీ కండువా కప్పుకున్నారు. పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరారు. హైదరాబాద్ లో పల్లె రవికుమార్ గౌడ్, ఆయన భార్య కల్యాణి (ప్రస్తుతం చండూరు ఎంపీపీ) ప్రగతి భవన్ లో కేటీఆర్ తో సమావేశమయ్యారు. పార్టీ కండువా కప్పి పల్లె రవి దంపతులను టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్.
ఉద్యమ కాలం నుంచి మాతో కలిసి పని చేసిన పల్లె రవికుమార్ మళ్లీ టీఆర్ఎస్ కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ గెలుపు కోసం టిఆర్ఎస్ లో చేరేందుకు ముందుకు వచ్చిన పల్లె రవికుమార్ కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పాత మిత్రుడు పల్లె రవికుమార్ కి కచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని మంచి రాజకీయ అవకాశాలను పార్టీ కల్పిస్తుంది కేటీఆర్ భరోసా ఇచ్చారు.
అనంతరం పల్లె రవికుమార్ మాట్లాడుతూ ఇవాళ కేటీఆర్ సమక్షంలో మేం అన్ కండిషనల్ గా పార్టీలో చేరామని అన్నారు. చండూరు ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలన్న ప్రధానమైన ప్రజల కోరికను కేటీఆర్ కి తెలియజేశానని పల్లె తెలిపారు. కేటీఆర్ ఇందుకు సానుకూలంగా స్పందించారని, ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం మా వంతు కృషిని చేస్తామని పల్లె రవికుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు తెరాసా నేతలు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మార్రి రాజశేఖరరెడ్డి, కర్నె ప్రభాకర్, బొంతు రామ్మోహన్ తదితరులు ఉన్నారు.
టీఆర్ఎస్ పార్టీలో చేరిన మునుగోడు కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRTRS గారి సమక్షంలో మునుగోడు కాంగ్రెస్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్, వారి సతీమణి చండూరు ఎంపీపీ కల్యాణి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.#MunugodeWithTRS #VoteForCar pic.twitter.com/Ovdsq0IhyF
— BRS Party (@BRSparty) October 15, 2022