Site icon HashtagU Telugu

Minister Seethakka : మావోయిస్టుల ఏరివేతను ఆపండి.. సీతక్కకు భారత్ బచావో ప్రతినిధులు వినతి

Bharat Bachao representatives appeal to Seethakka

Bharat Bachao representatives appeal to Seethakka

Minister Seethakka : హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాదె ఇన్నయ్య, డాక్టర్ ఎమ్ ఎఫ్ గోపీనాథ్, జంజర్ల రమేష్ బాబు కలిశారు. ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను నిలిపివేసేలా తన వంతు ప్రయత్నం చేయాలని మంత్రి సీతక్కను ఈ విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ కగార్‌ను తక్షణం నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని ప్రతినిధులు పేర్కొన్నారు. వేల సంఖ్యలో కేంద్ర బలగాలు కర్రెగుట్ట ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారని మంత్రికి విన్నవించారు. ఇక, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ, దాని అనుబంధ సంఘాలు, పౌరహక్కుల సంఘాలు సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాయి. మావోయిస్టుల ఏరివేతను ఆపి శాంతి చర్చలు జరపాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.

Read Also: Kaleswaram : కాళేశ్వరం కమిషన్‌ గడువు పెంపు

మరోవైపు ఈ విషయంపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపివేయాలని కోరారు. శాంతి యుత వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా ప్రభుత్వాల లక్ష్యంగా పని చేయాలని అన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన విధానాలు ఉంటాయి. అందుకే ప్రభుత్వాలు, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వారి శాంతియుత జీవన విదానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి..అని మంత్రి సీతక్క కోరారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌లో శాంతియుత వాతావరణం నెలకొనాలి. మధ్య భారతంలోని ఆదివాసీ ప్రాంతాలు రాజ్యాంగంలోని షెడ్యూల్-5 పరిధిలోకి వస్తాయి. అక్కడ ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు ఉంటాయి.

ఆపరేషన్ కగార్‌తో ఆదివాసీలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలి. రెండు వైపుల ప్రాణ నష్ట నివారణకు శాంతి చర్చలు మార్గం చూపుతాయి..అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలి. బల ప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆదివాసీ బిడ్డగా కోరుకుంటున్నా. ఆదివాసీల హక్కులను ఎవరూ కాలరాయవద్దు. ఆ జాతి బిడ్డగా ఆదివాసీలకు అండగా నిలుస్తా అని మంత్రి సీతక్క అన్నారు.

Read Also: KCR Vs BJP : కాంగ్రెస్‌ విలన్ ఐతే.. బీజేపీ ఫ్రెండా ? కేసీఆర్ మాటలకు అర్థాలే వేరులే!