రెండు రోజులుగా తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కుట్ర కోణం వెలుగుచూడటమే దీనికి కారణం. ఈ అంశంపై అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండు పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పెట్టిన మీడియా సమావేశంలో హాట్ కామెంట్స్ వెలుగుచూశాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు కుట్ర జరిగిందంటూ కేసీఆర్ రూపొందించిన సినిమా… అట్టర్ ప్లాప్ అయ్యిందని, కథ, స్ల్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ఫెయిలైందని సెటైర్స్ వేశారు.
‘‘ఈ విషయంలో కొందరు ఐపీఎస్ లు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే బాధ కలుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు పోలీసులంటే గౌరవం లేకుండా పోతోంది. కష్టపడి ఐపీఎస్ చదువుకున్న వాళ్లంతా చాలా బాధపడుతున్నరు. కొందరి వ్యవహారశైలి వల్ల హోంగార్డుల నుండి ఉన్నతస్థాయి అధికారుల వరకు ఐపీఎస్ లను చూసి ఛీ కొడుతున్నరు. ప్రభుత్వాలు ఏవీ శాశ్వతం కాదు. పోలీసులు చట్టాన్ని కాపాడుతూ నిజాయితీగా వ్యవహరించాలి. చట్టాన్ని ధిక్కరిస్తే ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులే బలవుతారనే విషయాన్ని మర్చిపోకూడదు. డీకే అరుణ, జితేందర్ రెడ్డి మీద వస్తున్న కథనాలు, మీడియాలో వస్తున్న కథనాలతోపాటు వారి ఇండ్లపై జరిగిన దాడిని చూస్తే బాధేస్తోంది. డీకే అరుణ మంత్రిగా పనిచేశారు. జిల్లా అభివృద్ది కోసం ఏళ్ల తరబడి పని చేశారు. అలాంటి నేతలకు, హత్య కేసుకు ముడిపెట్టి కథనాలు రాయడం చాలా బాధ కలిగించింది’’ అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘జితేందర్ రెడ్డి సౌమ్యుడు. ఇచ్చిన బాధ్యతను తూ.చ తప్పకుండా నిర్వర్తించే వ్యక్తి. రెండు సార్లు ఎంపీగా కొనసాగారు. గతంలో కేసీఆర్ వద్ద కూడా ఉన్నారు. కేసీఆర్ వద్ద ఉన్నప్పుడు ఎన్ని కుట్రలు చేసిండు? ఎంతమందిని హత్య చేసిండో మరి కేసీఆర్ చెప్పాలి. ఇకనైనా ఆధారాల్లేకుండా సీనియర్ నేతల వ్యక్తిత్వాన్ని చంపేసేలా కథనాలు రాయకూడదని కోరుతున్నా. ఇదిగో.. ఎఫ్ఐఆర్ లోగానీ, రిమాండ్ రిపోర్ట్ లో గానీ ఎక్కడా వారి పేర్లు రాలేదు. కానీ రాత్రి నుండి టీఆర్ఎస్ నేతలు, మీడియాలో.. డీకే అరుణ, జితేందర్ రెడ్డిలపై ఆరోపణలతో అనేక రకాలుగా ప్రచారం చేస్తున్నరు. ఆరోపణలు చేసిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు తలకాయ యాడ పెట్టుకుంటరు? కేవలం బీజేపీని అప్రదిష్టపాల్జేయడానికి మాత్రమే సీఎం డైరెక్షన్ లో పన్నిన కుట్ర ఇది అని స్పష్టంగా అర్ధమవుతోంది’’ అని బండి బల్లగుద్ది మరీ చెప్పారు.
‘‘అవినీతి ఆరోపణలున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కాపాడటంలో భాగంగా సీఎం ఒక తప్పు చేయబోయి…మరిన్ని తప్పులు చేస్తున్నట్లు స్పష్టమైంది. బీజేపీ హత్యా రాజకీయాలను ఎన్నటికీ సమర్ధించదు. మంత్రిపైనే కాదు… మామూలు వ్యక్తిపై హత్యకు కుట్ర చేసినా తప్పే. కానీ ఎవరైతే మంత్రి అవినీతి, అక్రమాలపైన పూర్తి ఆధారాలతో సహా కోర్టులను, ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించారో…. ఎవరైతే తమను హత్య చేసే కుట్ర జరుగుతోందని, తమకు రక్షణ కల్పించాలని మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారో…. వారికి రక్షణ కల్పించాలని మానవ హక్కుల కమిషన్ కూడా ఆదేశాలిచ్చిందో…. చివరకు వాళ్లే శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేశారంటూ పోలీసులు కేసు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదేం న్యాయం? సరే…ఈ అంశాలన్నీ ఇప్పుడు న్యాయ స్థానం పరిధిలో ఉన్నందున ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. కోర్టులో నిజానిజాలు తేలుతాయి’’ అని కేసీఆర్ ప్రభుత్వ తీరుపై బండి సంజయ్ విరుచుకుపడ్డారు.
‘‘శ్రీనివాస్ గౌడ్ అక్రమాలు, భూ కబ్జాల గురించి మహబూబ్ నగర్ ప్రజలందరికీ తెలుసు. అందుకే టీఆర్ఎస్ ను ఛీదరించుకుంటున్నరు. బీజేపీని ఆదరిస్తున్నరు. సీఎం చేసిన సర్వేలన్నింట్లోనూ ఇవే రిపోర్టులొస్తుండటంతో దీనిని దారి మళ్లించి బీజేపీని బదనాం చేయడానికి ఆడిన డ్రామా ఇది. అందుకే సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసే వారిపైన, అమాయకులపైన కేసులు పెడుతున్నరు. స్థానిక మంత్రి అక్రమాలు, భూ దందాలు, ఇసుక దందాలు తెలియని దెవరికి? చివరకు తనకు కప్పం కట్టకపోతే మహబూబ్ నగర్ జిల్లాలో ఎవరూ వ్యాపారం చేసుకునే పరిస్థితి కూడా లేదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతల అక్రమాలకు అంతే లేకుండా పోతోంది. బెదిరింపుల్లో, రేపుల్లో, భూ కబ్జాల్లో, హత్యల్లో సహా ఇందుగలడందు లేదనే విధంగా ఎక్కడ చూసినా టీఆర్ఎస్ నేతలపైనే కేసులున్నయ్. నిర్మల్ లో సాజిద్ ఖాన్ అనే వ్యక్తి 16 ఏళ్ల హిందూ బాలికను డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానని ఆశ చూపి రెండు రోజులపాటు దారుణం చేస్తే వాడిని పట్టుకోవడానికి ఈ పోలీసులకు చేత కాలేదు. వారం రోజులు పట్టింది. కానీ మంత్రిని హత్య చేస్తానికి కుట్ర పన్నారంటూ వీళ్లను మాత్రం ఒక్కరోజులోనే ఢిల్లీపోయి పట్టుకొచ్చిండ్రు. ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రం వెళ్లినప్పుడు… ఆ రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చి ఆరోపణలున్న వారిని అదుపులోకి తీసుకోవాలి. కానీ అదేమీ చేయకుండా… కనీసం కోర్టు నుండి ట్రాన్సిట్ వారెంట్ కూడా తీసుకోకుండా చెప్పాపెట్టకుండా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారంటే ఈ సమాజానికి పోలీసులు ఏం చెప్పాలనుకుంటున్నరు? అని పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించారు బండి సంజయ్.
‘‘అసలు జితేందర్ రెడ్డి ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంది? డ్రైవర్ ను తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? చివరకు ఈ ఎపిసోడ్ పై ఫిర్యాదు చేసిన జితేందర్ రెడ్డి పీఏ రాజును కూడా ఈ కేసులో ఇరికించే కుట్ర చేయడమేంటి? ఆయనను కూడా విచారణకు రావాలంటూ నోటీసులివ్వడం సిగ్గు చేటు. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే థిక్కరిస్తున్నరు. ఇంటిపై దాడి చేసి సంబంధం లేని వ్యక్తులను కిడ్నాప్ చేసి కొట్టి బలవంతం చేస్తుంటే…. వీళ్లు పోలీసు అధికారులు ఎట్లా అయ్యారో అర్ధం కావడం లేదు. నిన్న సైబరాబాద్ సీపీ ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే… జనం నవ్వుకుంటున్నరు. పాపం ఆయన మాత్రం ఏం జేస్తడు. పైవాళ్లు చెప్పినట్లు చెప్పలేక నానా ఇబ్బంది పడ్డట్లు కన్పించింది. నిన్న జరిగిన మొత్తం వ్యవహారంపై పూర్తి విచారణ జరగాలి. వాస్తవాలు బయటకు రావాలి. ఈ అంశంపై ఉన్నతస్థాయి విచారణ సంస్థలను ఆశ్రయిస్తాం. మొత్తం వ్యవహారం నిగ్గు తేలేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని బండి తేల్చి పారేశారు.
‘‘సీఎంకు మంచి సలహాలివ్వాల్సిన స్ట్రాటజిస్టులే ఇలాంటి అరాచకాలు, హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తే ఎట్లా? అలాంటి వారిపైనా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో స్ట్రాటజిస్ట్ పాత్ర ఏమిటి? లేక సీఎం స్వయంగా ఈ కుట్రకు తెరదీశారా? అనే దానిపైనా విచారణ జరపాలి. బీజేపీ మాత్రం ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదు. తెగించి కొట్లాడతాం. తెలంగాణ ప్రజలకు నా విజ్ఝప్తి.. డీకే అరుణ, జితేందర్ రెడ్డిలపై టీఆర్ఎస్ ఏ విధంగా కుట్ర చేసిందో ఆలోచించాలి. సీఎం కేసీఆర్ చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలి. బీజేపికి మద్దతివ్వాలని కోరుతున్నా’’ అని మీడియా సమావేశంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పుకొచ్చారు.