గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే బెయిల్పై విడుదలైన ఆయన్ను పోలీసులు తిరిగి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. న్యాయస్థానం మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో గురువారం అర్థరాత్రి వేళ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు. గతంలో నమోదైన ఈ తీవ్రమైన నేరారోపణల కేసులో అరెస్టయిన భగీరథ్కు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కోర్టు గతంలోనే రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అతడు చర్లపల్లి జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
అయితే తాను ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్నానని, తన విద్యా సంవత్సరం పాడవకుండా పరీక్షలు రాసేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని కోరుతూ బండి భగీరథ్ తరఫు న్యాయవాదులు జిల్లా కోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థి భవిష్యత్తును, చదువును దృష్టిలో ఉంచుకున్న న్యాయస్థానం మానవతా దృక్పథంతో స్పందించింది. ఇంజనీరింగ్ పరీక్షలకు హాజరు అయ్యేందుకు వీలుగా ఈ నెల 20వ తేదీన అతడికి షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన ఈ ఊరటతో జైలు నుంచి బయటకు వచ్చిన భగీరథ్ తన పరీక్షలకు హాజరయ్యాడు.
కోర్టు విధించిన కఠినమైన నిబంధనల ప్రకారం గురువారంతో బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ కాల పరిమితి ముగిసింది. బెయిల్ గడువు ముగియగానే అప్రమత్తమైన మేడ్చల్ పోలీసులు గురువారం రాత్రి అతడిని తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితుడిని నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ల ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకున్న అనంతరం.. అర్థరాత్రి దాటాక కట్టదిట్టమైన భద్రత మధ్య చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించి జైలు అధికారులకు అప్పగించారు.
అయితే ఓ 17 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మానసికంగా వేధించాడని, ఓరోజు ఫామ్ హౌస్కు తీసుకెళ్లి.. మద్యం తాగించాక ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే మే 16వ తేదీన పోలీసులు బండి భగీరథ్ను అరెస్ట్ చేశారు.
ఈ పోక్సో కేసులో దర్యాప్తు ఇప్పటికే కీలక దశకు చేరుకుందని, నిందితుడికి పరీక్షల కోసమే తాత్కాలిక ఉపశమనం లభించిందని, కేసు విచారణ చట్టప్రకారం యథావిధిగా కొనసాగుతుందని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. ఈ హైప్రొఫైల్ కేసులో తదుపరి కోర్టు విచారణ ఏ విధంగా ఉండబోతుందనే అంశంపైనే ఇప్పుడు అందరూ దృష్టి సారించారు.
