ఓ యువకుడి దాడిలో తమ్ముడు పృథ్వీ మృతి చెందగా.. అక్క సంఘవి తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైంది. ఈ దారుణ ఘటన ఆదివారం మధ్యాహ్నం ఎల్బీనగర్(LB Nagar) ఆర్టీసీ కాలనీలో చోటుచేసుకుంది. ఇంట్లో సంఘవి, చింటూ(పృథ్వీ) మాత్రమే ఉన్న సమయంలో లోపలికి చొరబడిన యువకుడు ఇద్దరిపై దాడికి(Attack) పాల్పడ్డాడు.
మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో ఆర్టీసీ కాలనీలో ఉన్న సంఘవి ఇంటికి రామంతపూర్ కు చెందిన శివకుమార్ వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో సంఘవి, ఆమె తమ్ముడు చింటూ ఉండగా కొద్దిసేపటికి చింటూ – శివకుమార్ ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో శివకుమార్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఇద్దరిపైనా విచక్షణా రహితంగా దాడి చేశాడు.
మొదటి అంతస్తులో ఈ ఘటన జరగగా అద్దాలు పగిలిన శబ్దం రావడంతో స్థానికులు అక్కడికి చేరుకుని శివకుమార్ ను బంధించారు. తీవ్రగాయాలతో రక్తపుమడుగులో పడి ఉన్న సంఘవి, చింటూలను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చింటూ అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. ప్రస్తుతం సంఘవి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సంఘవి, శివకుమార్ లకు గతంలోనే పరిచయం ఉండి ఉండవచ్చని, ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శివ కుమార్ ని విచారించిన అనంతరం మిగతా విషయాలు తెలియచేస్తామని తెలిపారు.
Also Read : Fraud : విద్యాసంస్థలో భారీ లాభాలని ఆశ చూపి.. ఎన్నారైని నిండాముంచిన ఘరానా దంపతులు