Lok Sabha Segments : తెలంగాణలోని ఐదు లోక్ సభ సెగ్మెంట్లకు కో-ఇన్ఛార్జ్లను కాంగ్రెస్ పార్టీ నియమించింది. మహబూబ్ నగర్ లోక్సభ స్థానానికి కో ఇన్ఛార్జిగా జితేందర్ రెడ్డిని నియమించారు. జహీరాబాద్ లోక్సభ స్థానానికి మదన్ మోహన్ రావు, మెదక్ లోక్సభ స్థానానికి జగ్గారెడ్డి, వరంగల్ లోక్సభ స్థానానికి శ్రీధర్ బాబు, చేవెళ్ల లోక్సభ స్థానానికి రామ్మోహన్ రెడ్డిలను కో ఇన్ఛార్జ్లుగా ఏఐసీసీ అపాయింట్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. మదన్ మోహన్ రావు, జితేందర్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే వారికి పార్టీ కీలక బాధ్యతలను అప్పగించడం గమనార్హం. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ సీట్లు గెలిచి తీరాల్సిందేననే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈక్రమంలో ఇప్పటికే అన్ని పార్లమెంటు స్థానాలకు(Lok Sabha Segments) మంత్రులు, ఇతర కీలక నేతలను ఇన్ఛార్జ్లుగా కాంగ్రెస్ పార్టీ నియమించింది.
We’re now on WhatsApp. Click to Join
మరోవైపు బీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన హస్తం పార్టీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మునుగోడు టికెట్ను ఆశించిన అమిత్రెడ్డికి నిరాశే ఎదురైంది. దీంతో ఆయన కాంగ్రెస్లో చేరి అదే స్థానం నుంచి బరిలోకి దిగాలని భావించారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రీఎంట్రీతో అమిత్ రెడ్డికి టికెట్ దక్కకుండా పోయింది. అప్పటి నుంచే బీఆర్ఎస్కు దూరంగా ఆయన ఉంటున్నారు.
‘‘అర్థం లేని రాజకీయాలే బీఆర్ఎస్ కొంపముంచాయి. బీఎస్పీ మాదిరిగానే బీఆర్ఎస్ తయారైంది’’ అంటూ అమిత్ రెడ్డి తండ్రి గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీలోనే లిల్లీపుట్లను కేసీఆర్ తయారు చేశాడని ఆయన బహిరంగానే విమర్శించారు. పార్టీ నేతల అహంకారం వల్లే అధికారానికి బీఆర్ఎస్ దూరమైందని గుత్తా సుఖేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.