Site icon HashtagU Telugu

Munugode Poll: మునుగోడు పోలింగ్ కు సర్వంసిద్ధం!

Munugode

Munugode

మునుగోడు ఉప ఎన్నిక తుది ఘట్టానికి చేరుకుంది. హోరాహోరీగా సాగిన ప్రచారం ముగిసింది. ఇక పోలింగ్ కు సమయం ఆసన్నమైంది. నవంబర్ 3న ఉపఎన్నికకు పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఓటర్లకు కొత్త డిజైన్‌తో కూడిన ఓటర్ ఐడీలు పంపిణీ చేశారు. ఓటింగ్ ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలోని 7 మండలాల్లో చౌటుప్పల్‌, సంస్థాన్‌ నారాయణపుర్‌ మండలాలు రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఉన్నాయి.

ఉపఎన్నిక జరుగుతున్న ఈ రెండు మండలాల్లో భద్రతకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన పోలీస్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మునుగోడు నియోజకవర్గం పరిధిలో మొత్తం 2 లక్షల 41 వేల 855 మంది ఓటర్లున్నారు. ఇందులో 50 మంది సర్వీస్ ఓటర్లు, 5 వేల 685 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. నియోజకవర్గం మొత్తంలో 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు.  అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరగనుంది. ఈ నెల 6న నల్గొండ జిల్లా కేంద్రంలో కౌంటింగ్ జరగనుంది.