Site icon HashtagU Telugu

Telangana : బీఆర్ఎస్‌లో ఖ‌మ్మం “జ‌న‌గ‌ర్జ‌న” టెన్ష‌న్‌

Congress BRS

Congress BRS

ఖ‌మ్మం జిల్లాలో రేపు జ‌ర‌గ‌బోయే జ‌న‌గ‌ర్జ‌న వైపే అంద‌రి చూపు ఉంది. ఖమ్మంలో జరిగే జనగర్జన సభకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజ‌రుకానున్నారు. ఆయ‌న ఢిల్లీ నుంచి నేరుగా గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యంలో దిగ‌నున్నారు. అక్క‌డి నుంచి ప్ర‌త్యేక హెలికాఫ్ట‌ర్‌లో ఖ‌మ్మం రానున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఇప్పుడు తెలంగాణ వైపే అందరి ఫోక‌స్ ప‌డింది. తెలంగాణలో అధికారంకు దగ్గరయ్యామనే నమ్మకం కాంగ్రెస్ లో వచ్చింది. ఇటు బీజేపీ ఢిల్లీ నేతలు కూడా ఖమ్మం సభ వైపే చూస్తున్నారు. తెలంగాణలో బీజేపీని కాంగ్రెస్ హైజాక్ చేసింది. పూర్వ వైభవం దిశగా కాంగ్రెస్ సాగిపోతోంది. ఖమ్మం సభతో తెలంగాణలో అధికారం వైపు అడుగులు వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. తిరుగులేదనుకున్న బీఆర్ఎస్ లో ఖమ్మం సభతో ప్రకంపనలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ నుంచి పెద్ద లీడ‌ర్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఖమ్మం జ‌న‌గ‌ర్జ‌న త‌రువాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మ‌న్లు చేరే అవ‌కాశం ఉంది. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం జ‌న‌గ‌ర్జ‌న‌పై ఆందోళ‌న‌లో ఉంది.

సీఎల్పీనేత భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. ఆదివారం భట్టి యాత్ర ముగింపు వేళ బహిరంగ సభకు సర్వం సిద్ధమవుతోంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా పార్టీ బలోపేతంకై కృషి చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను రాహుల్‌ గాంధీ ఘనంగా సత్కరించనున్నారు. లక్షలాది మంది సమక్షంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతను కాంగ్రెస్ అగ్ర నేతే సత్కరించటం అనేది అరుదైన సందర్భం. ఇప్పుడు భట్టికి ఈ అపూర్వ అవకాశం దక్కింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా భట్టి పీపుల్స్ మార్చ్ యాత్ర మొదలైంది. పార్టీకి వచ్చిన ఆదరణ, కార్యకర్తల్లో కొత్త జోష్, కేడర్ లో వచ్చిన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. భట్టి యాత్ర పైన ఎప్పటికప్పుడు సమాచారం సేకరించిన రాహుల్ గాంధీ ఖచ్చితంగా భట్టికి తగిన గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు.

దీంతో భట్టి పాదయాత్ర ముగింపు సభగా, పొంగులేటితో సహా ఇతర ముఖ్య నేతల చేరిక సభగా ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన నిర్వహణకు సిద్ధమైంది. ఖమ్మంలో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు సందడి చేస్తున్నారు. ఖమ్మం సభ వేళ తెలంగాణ కాంగ్రెస్ లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఖమ్మం చేరుకున్న రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. పార్టీ నేతలతో కలిసి వైరా రోడ్డులోని ఎస్‌ఆర్‌ గార్డెన్‌ సమీపంలో వంద ఎకరాల స్థలంలో చేస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జనగర్జన సభకు ముందు రాహుల్ గాంధీ ఖమ్మం చేరుకునే సమయంలో యువజన కాంగ్రెస్ నేతలు భారీ బైకు ర్యాలీకి ప్లాన్ చేశారు. ఆ ర్యాలీలో రాహుల్ గాంధీ పొల్గొంటారు. అంచనాలకు మించి జనం హాజరయ్యే అవకాశం ఉందని నేతలు అంచనా వేస్తున్నారు.