Kalvakuntla Kanna Rao : తనను బెదిరించి డబ్బు తీసుకున్నట్లు సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయవర్ధన్ రావు ఫిర్యాదు చేయడంతో మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు నమోదైంది. కన్నారావుతో పాటు ఇంకో ఐదుగురిపై హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను గెస్ట్హౌస్లో నిర్బంధించి దాడి చేశారని వారందరిపై సదరు సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆరోపణలు చేశాడు.
We’re now on WhatsApp. Click to Join
పోలీసుల కథనం ప్రకారం.. ఓ సమస్య పరిష్కారం కోసం కన్నారావు(Kalvakuntla Kanna Rao) వద్దకు సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయవర్ధన్ రావు వెళ్లారు. సదరు సాఫ్ట్వేర్ ఉద్యోగి వద్ద నగలు, నగదు ఉన్నాయని.. కన్నారావుకు నందిని అనే మహిళ చెప్పింది. అనంతరం నందినికి చెందిన గెస్ట్ హౌస్కు విజయవర్ధన్ రావును పిలిపించి నిర్బంధించారనే అభియోగం ఉంది. ఆ గెస్ట్ హౌస్లో బెదిరించి రూ.60 లక్షల నగదు, 97 తులాల బంగారంను కన్నారావు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు పోలీసు అధికారి భుజంగరావు, ఏసీపీ కట్టా సాంబయ్య తెలుసని.. కన్నారావు బెదిరించాడని బాధిత సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే మన్నెగూడ భూవివాదం కేసులో కన్నారావును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అంతకు ముందు హైదరాబాద్ శివారులోని మన్నెగూడలో ఉన్న భూమిని కబ్జా చేశారనే అభియోగాలతో కన్నారావును పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు పంపించారు. 14 రోజుల పాటు కన్నారావుకు రిమాండ్ విధించారు. సురేందర్ రెడ్డి దగ్గర ఉన్న 2.10 ఎకరాల భూమిని 2013లో చామ సురేశ్కు రూ.50 లక్షలు తీసుకొని జీపీఏ చేశాడు. రూ.50 లక్షలు తిరిగి ఇచ్చినప్పుడు భూమి తిరిగి ఇస్తానని ఒప్పంద పత్రం రాసుకున్నారు. అయితే 2020 వరకు సురేందర్రెడ్డి డబ్బులు ఇవ్వకపోవడంతో సురేశ్ ఆభూమిని వేరే వాళ్లకు విక్రయించాడు. ఇలా తనకు చెప్పకుండా చేయడం సురేందర్రెడ్డికి నచ్చక, ఆ సంస్థపై తరుచూ గొడవకు వెళ్లేవాడు. దీనిపై ఓఎస్ఆర్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అప్పుడు మాజీ సీఎం కేసీఆర్ సోదరుడి కుమారుడు కన్నారావు వద్దకు వెళ్లారు. అతనితో కోటి రూపాయల ఒప్పందం కుదుర్చుకుని ఆ భూమి మీదకు వెళ్లి విధ్వంసం సృష్టించారు. ఈ కేసులో పోలీసులు 38 మందిని నిందితులుగా చేర్చారు. అయితే కన్నారావు ఇంకా ఏం అక్రమాలు చేశాడో పోలీసులు కూపీ లాగుతున్నారు.