Christmas Celebrations: ఆసియాలోనే రెండో అతి పెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ చర్చిలో (Christmas Celebrations:) శతాబ్ది ఉత్సవాలలో భాగంగ క్రిస్మస్ వేడుకలు అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. .ఆనవాయితీ ప్రకారం ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున చర్చి కమిటీ బాధ్యులు శిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి చర్చిలోని ప్రధాన వేదిక మీద ప్రతిష్టించారు. తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రాతకాల ఆరాధనతో మెదక్ చర్చిలో క్రిస్మస్ మహోత్సవం ప్రారంభమైంది.
ఈ 100 ఏళ్ల వేడుకలో చర్చి నిర్మాత ఛార్లెస్ వాకర్ పోస్నెట్ మూడో తరం కుటుంబ సభ్యులు లండన్ నుంచి క్రిస్టమస్ వేడుకలలో పాల్గొన్నారు. ఇంచార్జీ బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ మత విశ్వాసులకు దైవ వాక్యాన్ని ఇచ్చారు. సుమారుగా 5 వేల మంది భక్తులు ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా ఏసుక్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలియజేసేలా చర్చిలో ప్రధాన వేదిక ముందు సంప్రదాయ పద్దతిలో పశువుల పాక ఏర్పాటుచేసి దానికి స్టార్స్ వేలాడదీశారు. మరో పక్కన పెద్ద సైజు క్రిస్మస్ ట్రీని ఏర్పాటుచేసి దానికి బెల్స్, స్టార్స్, గ్రీటింగ్ కార్డ్స్ రంగురంగుల బాల్స్తో అందంగా అలంకరించారు.
Also Read: Tsunami Boy : సునామీ బాయ్ ఎవరు ? బేబీ81 కథ ఏమిటి ?
చర్చిలోని విశాలమైన హాలును రంగురంగుల మెరుపు కాగితాలు, బెలూన్లు, స్టార్లతో శోభాయమానంగా అలంకరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల నుంచి భారీ ఎత్తున క్రిస్టియన్ సోదరులు మెదక్ చర్చికి తరలిరానున్నారు. ఈ మేరకు సీఎస్ఐ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 409 మంది పోలీసులతో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
సీఎం రేవంత్ రెడ్డి నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ లో కొల్చారం చేరుకోనున్నారు. సీఎం రేవంత్ తో పాటు హెలికాప్టర్ లో మెదక్ కి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ కూడా రానున్నారు. అక్కడి నుంచి వాహనంలో ఏడుపాయల ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచి మెదక్ చర్చిలో వందేళ్ల వేడుకలో పాల్గొని క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం ఒంటిగంటకు తిరిగి హెలికాప్టర్ లో హైదరాబాద్ పయనం కానున్నారు.