Site icon HashtagU Telugu

37th Hyderabad Book Fair : పుస్తక ప్రియులు ఎదురుచూసే సమయం రానేవచ్చింది

Hyderabad Book Fair

Hyderabad Book Fair

పుస్తక ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే హైదరాబాద్ బుక్ ఫెయిర్ (Hyderabad Book Fair) డిసెంబర్ 19న ప్రారంభం కానుంది. ఇందిరా పార్క్ (Indirpark) సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో 37వ పుస్తక ప్రదర్శన (37th Hyderabad Book Fair) 19న ప్రారంభమై 29 వరకు కొనసాగనుంది. ఈ వివరాలను బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు యాకూబ్ షేక్ ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 210కి పైగా ప్రచురణకర్తలు, పంపిణీదారులు పాల్గొననున్నారు.

ఈసారి ప్రదర్శనను విభిన్నంగా రూపొందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికి అనువుగా ఉండేలా వాతావరణం కల్పిస్తున్నామని యాకూబ్ షేక్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని వెల్లడించారు. పుస్తక ప్రదర్శనలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఇతర భాషల పుస్తకాలు కూడా లభ్యమవుతాయి. ఈసారి పుస్తక ప్రదర్శన మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. కేంద్ర సాహిత్య అకాడమీ ఈసారి ప్రదర్శనలో భాగస్వామ్యమవ్వడం విశేషం. ప్రదర్శన ప్రాంగణానికి దాశరథి కృష్ణమాచార్య పేరును, సభా వేదికలకు బోయి విజయభారతి, తోపుడుబండి సాధిక్ పేర్లను పెట్టారు.

పుస్తక ప్రదర్శన విజయవంతం చేయడంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఆచార్య కోదండరామ్, రామచంద్రమూర్తి వంటి ప్రముఖులు సూచనలు అందిస్తున్నారు. పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాలు కూడా ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పుస్తకాల పట్ల ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ బుక్ ఫెయిర్‌ను సందర్శించి ప్రదర్శనను విజయవంతం చేయాలని బుక్ ఫెయిర్ సొసైటీ పిలుపునిచ్చింది. ప్రదర్శనలో స్టాళ్లను ఏర్పాటు చేయాలనుకునే వారు ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Read Also : Fake Protein Supplements : నకిలీ ప్రొటీన్ సప్లిమెంట్లను దేనితో తయారు చేస్తారో తెలుసా..?