రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో వడదెబ్బతో 34 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ రోజురోజుకూ నిప్పుల కుంపటిగా మారుతోంది. రికార్డు స్థాయిలో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసిన సంగతి తెలిసిందే. అత్యవసరమైతే తప్ప ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచించింది. ఇక మధ్యాహ్నం పూట ప్రజల కోసం బయట ఏర్పాట్లు చేయాలని అధికారులకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో ఎండలు, వడగాలులు, వడదెబ్బ పరిస్థితులపై అత్యవసర సమీక్ష నిర్వహించారు.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్న నేపథ్యంలో ప్రజలంతా మరింత అలెర్ట్గా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక సూచనలు చేశారు. పిల్లలు, వృద్ధులు అత్యవసరమైతేనే బయటికి రావాలని తేల్చి చెప్పారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద ప్రజలకు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక వడదెబ్బతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. గతంలో వడదెబ్బ పరిహారం రూ.50 వేలు ఉండగా దాన్ని రూ.4 లక్షలకు పెంచినట్లు గుర్తు చేశారు.
ఇక తెలంగాణలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతుండగా.. 18కి పైగా జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 18 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు.. హైదరాబాద్ నగరంలోనూ 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా వడగాలులపై హై అలర్ట్ ప్రకటించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు అలెర్ట్గా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో ఎండల తీవ్రతకు సంబంధించి.. గంట గంటకు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా ఎండదెబ్బకు గురైతే.. వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి.. అత్యవసర చికిత్స అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
