రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) పెద్ద ఎత్తున ఆరోగ్య ఉత్సవాలకు (Health Festival) శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పలు కీలక నిర్ణయాలను అమలు చేశారు. ఈ సందర్భంగా 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 24 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లకు నియామక పత్రాలు అందజేశారు. అలాగే 108 కోసం 136, 102 కోసం 77 అంబులెన్సులకు జెండా ఊపి సీఎం రేవంత్ రెడ్డి (213 ambulances flagged off by CM to celebrate ‘Health Festival’) ప్రారంభించారు. వీటి ద్వారా అత్యవసర వైద్యం అందించడంలో మరింత సౌలభ్యం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆరోగ్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు చేర్చేందుకు ఈ కొత్త అంబులెన్సులు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
ఇక పారామెడికల్ విద్యారంగంలో అభివృద్ధికి దోహదం చేసే విధంగా 28 కొత్త పారామెడికల్ కాలేజీలను ప్రారంభించారు. వీటితో పాటు 16 నర్సింగ్ కాలేజీలు (16 Nursing and 28 Paramedical Colleges) ప్రారంభించి, నర్సింగ్ విద్యార్ధులకు మరింత అనుకూలమైన శిక్షణ కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ కాలేజీలు విద్యార్ధుల భవిష్యత్తుకు బలమైన వేదికగా నిలుస్తాయని సీఎం అన్నారు. అదేవిధంగా, ట్రాన్స్జెండర్ వ్యక్తుల ఆరోగ్య సేవలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు 33 ప్రత్యేక ట్రాన్స్జెండర్ క్లినిక్లను (33 Trangender Clinics) వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఈ క్లినిక్లు సమాజంలో అన్ని వర్గాల ప్రజల ఆరోగ్యానికి సమాన అవకాశాలు కల్పించే దిశగా కీలకమైన అడుగు అని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
సమాజంలోని అన్ని వర్గాల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సీఎం అన్నారు. ఈ కార్యక్రమాలు రాష్ట్ర ఆరోగ్య రంగంలో నూతన ఒరవడికి నాంది పలుకుతాయని ఆయన అభివర్ణించారు. “సమగ్ర ఆరోగ్య సేవలే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం,” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా సంక్షేమానికి పెద్దపేట వేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఒక్క రోజులో 14 వేల పోస్టులు భర్తీ చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు ప్రజల ఆరోగ్య సేవలో తరించాలన్నారు. గత ప్రభుత్వం విద్య, వైద్యరంగాలను తుంగలోకి తొక్కిందని, తాము ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ శాఖలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
Read Also : Minister Sridhar Babu : ఉద్యోగావకాశాల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వానిదే ఘనత – మంత్రి శ్రీధర్ బాబు