ఈ డిజిటల్ యుంగంలో డేటా (Data) కీలకంగా మారింది. అన్ని రకాల పనులు ప్రస్తుతం ఫోన్ ఆధారంగానే జరుగుతున్నాయి. కీలక సమాచారం అంతా స్మార్ట్ ఫోన్లలోనే ఉంటుంది. వివిధ మార్గాల్లో సైబర్ (Cyber) నేరగాళ్లు డేటాను దొంగిలించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. బ్యాంకు వివరాలు, పాస్వర్డ్లు హ్యాకర్ల (Hackers) చేతికి దొరికితే సమస్యలు తప్పవు. అందుకే ఆయా కంపెనీలు యూజర్ డేటాకు ప్రైవసీ (Privacy), సెక్యూరిటీ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. వాట్సాప్ మెసెంజర్లో సెండ్ చేసే మెసేజ్లకు కూడా ఎన్క్రిప్షన్ ఉంది. ప్రస్తుతం గూగుల్ మెసేజెస్ (Google Messages)కి కూడా ఎన్క్రిప్షన్ కల్పించాలని, మెసేజెస్ గ్రూప్ ఛాట్ ఎక్స్పీరియన్స్ను అభివృద్ధి చేయాలని గూగుల్ (Google) భావిస్తోంది. అందుకే రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (RCS) ను అభివృద్ధి చేస్తోంది. ఈ అప్డేట్కు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గూగుల్ (Google) ఎండ్-టు-ఎండ్ (End-to-End) ఎన్క్రిప్టెడ్ రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (Rich Communication Services) గ్రూప్ చాట్ (Group Chat) లను టెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే కొన్ని వారాల్లో ఓపెన్ బీటా ప్రోగ్రామ్ ద్వారా కొంతమంది వినియోగదారులకు అందుబాటులో వస్తుందని తెలిపింది. ఈ ఫీచర్తో గూగుల్ మెసేజెస్ ఉపయోగించి పంపిన వన్- ఆన్- వన్ టెక్స్ట్లు ఎన్క్రిప్ట్ అవుతాయి. దీంతో ఈ మెసేజ్లు ప్రైవేట్గా, సెక్యూర్గా ఉంటాయని, సెండర్, రిసీవర్ తప్ప మరొకరు చూడలేరని గూగుల్ ఓ బ్లాగ్ పోస్ట్లో పేర్కొంది. రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ టెక్స్టింగ్ను మరింత సురక్షితంగా చేయడమే కాకుండా, బెస్ట్ ఎక్స్పీరియన్స్ను కూడా అందిస్తుందని తెలిపింది.
SMS టెక్స్టింగ్లో స్మార్ట్ ఫోన్లకు ఉన్న సామర్థ్యం ఉపయోగించడం లేదని చెప్పింది. కానీ రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ అంటే హై క్వాలిటీ ఫోటోలు, వీడియోలను సెండ్ చేయవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చని వివరించింది. రియల్ టైమ్ టైపింగ్ ఇండికేటర్స్ను, రీట్ రెసీప్ట్స్ను చూడవచ్చు, గ్రూప్ కన్వర్జేషన్లకు నేమ్ సెట్ చేయవచ్చు, గ్రూప్ చాట్లకు కాంటాక్ట్స్ను యాడ్ చేయవచ్చు, అదే విధంగా తొలగించవచ్చని బ్లాగ్పోస్ట్లో గూగుల్ స్పష్టం చేసింది. టైపింగ్ ఇండికేటర్స్, డెలివరీ, రీడ్ రెసీప్ట్స్ వంటి ఫీచర్లను కలిగి ఉన్న SMS సూపర్ఛార్జ్డ్ వెర్షన్ RCSని ఉపయోగించమని తయారీదారులు. క్యారియర్లను గూగుల్ కంపెనీ కోరుతోంది. యాపిల్ తన సొంత సందేశాల యాప్ కోసం ఈ స్టాండర్డ్స్ను పాటించేలా ఒప్పించేందుకు ప్రచారాలను కూడా ప్రారంభించింది.
Messages యాప్ గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ నీనా బుద్ధిరాజా ఒక బ్లాగ్ పోస్ట్లో.. నేడు, అన్ని ప్రధాన మొబైల్ క్యారియర్లు, తయారీదారులు రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (RCS)ను స్టాండర్డ్గా స్వీకరించినట్లు చెప్పారు. అయితే యాపిల్ అంగీకరించలేదన్నారు. RCSని స్వీకరించడానికి యాపిల్ ముందుకు రాలేదని, ప్రస్తుతం యాపిల్ వినియోగదారులు, ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగిస్తున్న వారికి మెసేజ్ పంపినప్పుడు SMSపై ఆధారపడాలని, అంటే వారి టెక్స్టింగ్ 1990లలో చిక్కుకుపోయిందని అన్నారు. అప్పటి సెక్యూరిటీ ఫీచర్లు, ఆప్షన్లనే ఆధారంగానే మెసేజ్లు పని చేస్తాయని తెలిపారు. యాపిల్ కంపెనీ నూతన RCSను స్వీకరిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.
Also Read: Mount Semeru: బద్ధలైన ‘మౌంట్ సెమేరు’. హెచ్చరికలు జారీ.