Site icon HashtagU Telugu

Rohit-Virat Future: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత రోహిత్-విరాట్ భవిష్యత్తు ఎలా ఉంటుంది?

ICC Test Rankings

ICC Test Rankings

Rohit-Virat Future: భారత జట్టు ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో అభిమానులతో పాటు సెలెక్టర్ల దృష్టి కూడా టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపైనే (Rohit-Virat Future) ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొత్తం ఆస్ట్రేలియాలోనే ఉండాలని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌ను కోరింది. ప్రస్తుత భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో రాబోయే సంవత్సరాల్లో రోడ్‌మ్యాప్ గురించి చర్చించడమే అగార్కర్ ఆస్ట్రేలియాలో ఉండటానికి కారణమ‌ని తెలుస్తోంది.

రోహిత్-విరాట్‌ల భవిష్యత్తుపై కూడా చర్చ!

న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా ప్రదర్శన పేలవంగా ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల‌ ఆటతీరుతో టీమ్ మేనేజ్‌మెంట్, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ సిరీస్‌లో రోహిత్ 90 పరుగులు చేయగా, కోహ్లీ 93 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పుడు ఈ సీనియర్ ఆటగాళ్లకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడ‌నున్నారు. అయితే వీరికి ఇదే చివరి అవకాశంగా తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో సిరీస్ కోల్పోవడానికి భారత జట్టు సీనియర్ ఆటగాళ్ల పేలవ ప్రదర్శన కూడా ఒక కారణం. మరో 8-9 నెలల్లో రెండు ఐసీసీ టోర్నీలు జరగనున్నాయని, ఆ తర్వాత ఈ ఆటగాళ్ల భవిష్యత్తు గురించి బీసీసీఐ ఆలోచించనున్న‌ట్లు తెలుస్తోంది.

Also Read: Gold Rates : పసిడి ప్రియులకు బిగ్ షాక్..మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర

దీనికి సంబంధించి BCCI అధికారి ఒక‌రు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. “భారతదేశంలో ఇంత పేలవమైన ప్రదర్శన విస్తృత విమర్శలకు దారితీస్తుందని అగార్కర్, గంభీర్ ఇద్దరికీ తెలుసు. బోర్డ‌ర్‌- గ‌వాస్క‌ర్ ట్రోఫీ లాంగ్ టూర్ కావడంతో ఇద్దరు కలిసి కూర్చుని ఈ టూర్ తర్వాత ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చించుకోవచ్చు. బలమైన బ్యాకప్ బృందాన్ని నిర్మించడానికి ఇద్దరికీ కనీసం ఒకటిన్నర సంవత్సరాలు అవసరం ఉంద‌ని తెలిపారు.

గంభీర్, అగార్కర్.. విరాట్‌, రోహిత్ భ‌విష్యత్తు గురించి వారితో మాట్లాడాలనుకుంటున్నారు. ఈ ఇద్ద‌రూ ఆటగాళ్లు ఇకపై భారతదేశం కోసం T20 అంతర్జాతీయ క్రికెట్ ఆడరు. కానీ 2027 సంవత్సరంలో జరిగే ODI ప్రపంచ కప్‌లో ఈ ఆటగాళ్ల ఆసక్తిని కూడా బోర్డు తెలుసుకోవాలనుకుంటోంది.