Virat Kohli: కోహ్లీని చుట్టేసిన ఫ్యాన్స్.. వీడియో వైరల్..!

టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో బ్లాక్‌బస్టర్ సెమీ ఫైనల్ పోరుకు ముందు టీమిండియా సోమవారం అడిలైడ్‌కు

  • Written By:
  • Publish Date - November 10, 2022 / 12:47 PM IST

టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో బ్లాక్‌బస్టర్ సెమీ ఫైనల్ పోరుకు ముందు టీమిండియా సోమవారం అడిలైడ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ అండ్ కో సోమవారం శిక్షణ నుండి కొంత విరామం తీసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. అయితే భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సోమవారం రాత్రి భోజనం ముగించుకుని ఓ రెస్టారెంట్ నుంచి బయటికి వస్తుండగా అభిమానులు విరాట్ తో ఫొటోల కోసం ఎగబడ్డారు. దీనికి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు కోహ్లీతో సెల్ఫీలు తీసుకునే ప్రయత్నంలో విరాట్ ను చుట్టముట్టడం మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఫ్యాన్స్ తాకిడికి భద్రతా సిబ్బంది కోహ్లిని బస్సులోకి ఎక్కించాల్సి వచ్చింది. ఈ వీడియోలో ఫ్యాన్స్ కోహ్లీ కోహ్లీ అని నినాదించారు.

ఈరోజు ఆడిలైడ్‌లో టీమిండియా.. ఇంగ్లాండ్ జట్టుతో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఇరు జట్ల మధ్య ఇప్పటిదాకా మూడు మ్యాచ్ లు జరగగా రెండింట్లో టీమిండియా గెలిచింది. ఓ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కి విజయం వరించింది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కీలక పాత్ర పోషించనున్నాడు. ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో 3 హాఫ్ సెంచరీలతో 246 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ.. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తన సత్తా మరోసారి చూపటానికి సిద్దమయ్యాడు.

2012 టోర్నీలో చివరిసారిగా ఇంగ్లాండ్‌తో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఆడిన టీమిండియా.. 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ జట్టుతో ఆడనుంది. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అడిలైడ్ ఓవల్‌లో 14 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో అన్ని ఫార్మాట్లలో కలిపి 907 పరుగులు చేశాడు. ఈ వేదికపై కోహ్లి 75.58 సగటుతో ఉన్నాడు. నేడు జరగబోయే సెమీఫైనల్‌లోనూ కోహ్లి భారీ స్కోరు చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.