Team India : టీ20 ప్రపంచకప్ గెల్చుకున్న టీమ్ ఇండియా కరీబియన్ ద్వీపం బార్బడోస్ నుంచి ప్రత్యేక ఎయిర్ ఇండియా ఛార్టర్డ్ విమానంలో గురువారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది. బెరిల్ హరికేన్ కారణంగా బార్డడోస్ ఎయిర్పోర్ట్ మూతపడింది. దీంతో టీ20 వరల్డ్ కప్లో ఘన విజయాన్ని సాధించిన భారత క్రికెట్ హీరోలు అక్కడే నాలుగు రోజుల పాటు ఉండిపోవాల్సి వచ్చింది. వాతావరణం మెరుగుపడిన తర్వాత ప్రపంచ ఛాంపియన్లను స్వదేశానికి తీసుకురావడానికి ప్రత్యేక ఎయిర్ ఇండియా ఛార్టర్డ్ విమానాన్ని బార్బడోస్కు పంపారు. దాదాపు 18 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆ ప్రత్యేక విమానంలో టీమిండియా ప్లేయర్లు ట్రోఫీని తీసుకొని తమ సొంతదేశంలోకి అడుగుపెట్టారు. చార్టర్డ్ విమానం నుంచి భారత జట్టు ఆటగాళ్లు ట్రోఫీని తీసుకుంటున్న ఓ వీడియోను బీసీసీఐ ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేసింది.
It’s home 🏆 #TeamIndia pic.twitter.com/bduGveUuDF
— BCCI (@BCCI) July 4, 2024
We’re now on WhatsApp. Click to Join
విమానాశ్రయంలో, బస చేసే హోటల్లో టీమ్ ఇండియాకు(Team India) స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హోటల్లో టీమ్ ఇండియా సభ్యులు కలిసి ప్రత్యేక కేక్ను కట్ చేసి సంబురాలు చేసుకోనున్నారు. హోటల్లో వెల్కమ్ డ్రింక్స్ కూడా టీమ్ మొత్తానికి సిద్ధంగా ఉన్నాయి. తదుపరిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని టీమిండియా సభ్యులు గౌరవపూర్వకంగా కలుస్తారు. అనంతరం ముంబైలోని నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు అభిమానుల కోసం టీమిండియా ప్రత్యేక రోడ్ షో ఉంటుంది. అక్కడ మొత్తం జట్టును సత్కరిస్తారు.
తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు గురువారం తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో అభిమానులు ఢిల్లీ ఎయిర్ పోర్టు వద్ద గుమిగూడారు. ఆయా క్రికెటర్లు ఎయిర్ పోర్టులో నుంచి బస్సు ఎక్కేందుకు వస్తుండగా.. అక్కడున్న అభిమానులు వారిని పేర్లతో పిలవడం వీడియోల్లో కనిపించింది. కొందరు రోహిత్ అని..ఇంకొందరు విరాట్ అని పెద్దగా అరవడం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో వినిపించింది.