T20 World Cup: టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ హ్యాట్రిక్ విజయం అందుకుంది. ఆతిథ్య అమెరికాపై 7 వికెట్ల తేడాతో గెలిచి సూపర్ 8 బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్ లో తక్కువ స్కోరుకే పరిమితం అయిన అమెరికా చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చి ఆకట్టుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది.భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. అమెరికా మాత్రం రెండు మార్పులు చేసింది. మరోసారి పిచ్ బౌలింగ్ కే అనుకూలించిన వేళ భారత బౌలర్లు అదరగొట్టారు. అమెరికాను 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 110 పరుగులకే కట్టడి చేశారు.
అమెరికా బ్యాటర్లలో నితీష్ కుమార్ 27 , టేలర్ 24 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. పాండ్యా రెండు, అక్షర్ పటేల్ ఒక్క వికెట్ సాధించారు.
టార్గెట్ చిన్నదే అయినా పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించక పోవడంతో ఆరంభంలోనే భారత్ వికెట్లు కోల్పోయింది.తొలి ఓవర్లోనే నేత్రవల్కర్ బౌలింగ్లో విరాట్ కోహ్లి గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. కెప్టెన్ రోహిత్ శర్మను 3 రన్స్ ఔట్ చేయడంతో భారత్ కష్టాల్లో పడింది. సూర్య కుమార్ యాదవ్ తో కలిసి వికెట్ కీపర్ రిషబ్ పంత్ నిలకడగా ఆడే ప్రయత్నం చేశాడు.18 పరుగులు చేసిన రిషబ్ పంత్.. అలీ ఖాన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. ఈ దశలో శివమ్ దూబే కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. పిచ్ పరిస్థితిని అర్థం చేసుకుని సింగిల్స్ తీస్తూ సూర్య కుమార్ యాదవ్ కు చక్కని సపోర్ట్ ఇచ్చాడు. అటు సూర్య కుమార్ తనదైన షాట్లతో అలరించాడు. పిచ్ స్వభావానికి తగ్గట్టు భారీ షాట్లు కొట్టకుండా స్ట్రైక్ రొటేట్ చేయడంతో టార్గెట్ కరుగుతూ వచ్చింది. సూర్య , దూబే కీలక పార్టనర్ షిప్ తో టీమిండియా మరో 10 బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని అందుకుంది. సూర్య కుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేయగా…శివమ్ దూబే 31 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. కాగా ఆడిన మూడు మ్యాచ్ ల్లో గెలిచిన రోహిత్ సేన సూపర్ 8కు దూసుకెళ్లింది.
Also Read: Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో మరో ఎన్కౌంటర్..