వరల్డ్ క్రికెట్ లో భారత్ , పాక్ మ్యాచ్ కు ఎంత క్రేజ్ ఉందో…గత కొన్నేళ్లుగా స్టార్ స్పోర్ట్స్ రూపొందించే మౌకా.. మౌకా యాడ్ కూ అంతే క్రేజ్ ఉంది. 2015 నుంచి ప్రపంచకప్ లో భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ షెడ్యూలైన ప్రతిసారి మౌకా.. మౌకా అనే యాడ్ టీవీల్లో మార్మోగిపోయేది. ఆసియా కప్ లో మళ్లీ భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. దీంతో ముందు మౌకా.. మౌకా యాడ్ మళ్లీ టీవీల్లో సందడి చేస్తుందని భారత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఇప్పటి వరకూ ఆ యాడ్ జాడ లేదు. ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై ఆరా తీయడం మొదలుపెట్టారు. స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం స్పందించినట్లు తెలుస్తోంది. ఇక నుంచి మౌకా.. మౌకా యాడ్ ప్రసారం ఉండదని వారు తేల్చి చెప్పినట్లు సమాచారం. త్వరలో జగబోయే టీ ట్వంటీ ప్రపంచకప్కు కూడా ఈ యాడ్ను రూపొందించే ఉద్దేశం లేనట్టు సమాచారం.
గతేడాది టీ ట్వంటీ ప్రపంచకప్లో పాక్ చేతిలో టీమిండియా ఓటమి చెందడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
2015 వన్డే ప్రపంచకప్ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కు ముందు ఈ యాడ్ ను మొదటిసారిగా ప్రదర్శించారు. పాకిస్థాన్ లోని మూడు తరాలకు చెందిన ఒక కుటుంబలోని వ్యక్తులు ప్రపంచకప్ లో పాకిస్తాన్.. భారత్ ను ఓడిస్తే సంబరాలు చేసుకోవాలనేది ఈ యాడ్ థీమ్. ప్రతీసారి వాళ్ల ఆశలు అడియాసలే అయ్యేవి. దీంతో వాళ్లు తాము దాచుకున్న టపాసులను మళ్లీ అటకెక్కించేవారు. గతేడాది ముగిసిన టీ ట్వంటీ ప్రపంచకప్ లో కూడా ఈ యాడ్ ను కొత్త తరహాలో రూపొందించి ప్రసారం చేశారు.అయితే
2021 టీ ట్వంటీ ప్రపంచకప్ లో పాకిస్తాన్.. భారత్ ను ఓడించింది. దీంతో ఆ యాడ్ థీమ్ ఉద్దేశ్యం తీరినట్టయింది. ఈ నేపద్యంలో మళ్లీ ఆ యాడ్ ప్రసారం చేయడం సరి కాదనీ స్టార్ స్పోర్ట్స్ భావిస్తోంది. అయితే ఇండియా , పాక్ క్రికెట్ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా మరో థీమ్ తో ఫాన్స్ ముందుకు రావాలని స్టార్ స్పోర్ట్స్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.