New Zealand: టీ20 వరల్డ్ కప్ 2026 మొదటి సెమీఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్- సౌత్ ఆఫ్రికా మధ్య జరిగింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఇరు జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 170 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే కివీస్ జట్టు ఆ లక్ష్యాన్ని చాలా సులభంగా ఛేదించింది. టిమ్ సీఫెర్ట్ అర్ధశతకం, ఫిన్ అలెన్ సెంచరీతో రాణించడంతో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాపై ఘనవిజయం సాధించింది.
2026 టీ20 ప్రపంచ కప్లో న్యూజిలాండ్ జట్టు మొదటి సెమీఫైనల్లో విజయం సాధించింది. ఫిన్ అలెన్ చారిత్రాత్మక సెంచరీతో న్యూజిలాండ్కు రికార్డు స్థాయి విజయాన్ని అందించారు. ఈ ఓటమితో టీ20 ప్రపంచ కప్ గెలవాలనే దక్షిణాఫ్రికా కల మరోసారి భగ్నమైంది. 2026 టీ20 ప్రపంచ కప్ తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసి 169 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 12.5 ఓవర్లలోనే 173 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్ తరపున ఫిన్ అలెన్ 33 బంతుల్లోనే అజేయంగా 100 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఆయన ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. న్యూజిలాండ్ రెండోసారి టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకుంది.
Also Read: ముంబై వాంఖడే పిచ్.. క్యూరేటర్పై గంభీర్ అసహనం?!
కివీస్ జట్టులో అలెన్తో పాటు ఓపెనర్గా వచ్చిన టిమ్ సీఫెర్ట్ కూడా అద్భుతంగా రాణించారు. సీఫెర్ట్ 33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 58 పరుగులు చేశారు. వీరు ఇద్దరూ కలిసి మొదటి వికెట్కు 55 బంతుల్లో 117 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర, ఫిన్ అలెన్ రెండో వికెట్కు 22 బంతుల్లో అజేయంగా 56 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి, 43 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు.
టీ20 ప్రపంచ కప్లో అత్యంత వేగవంతమైన సెంచరీ
ఫిన్ అలెన్ టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశారు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ పేరు మీద ఉండేది. గేల్ 2016 టీ20 టోర్నమెంట్లో 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేశారు.
బౌలింగ్లో పూర్తిగా విఫలమైన దక్షిణాఫ్రికా
ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన స్థితి నుండి ఈ స్కోరును సాధించడంతో సఫారీ జట్టు పోరాడుతుందని అంతా భావించారు. కానీ న్యూజిలాండ్ ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ధాటికి దక్షిణాఫ్రికా బౌలర్లందరూ విఫలమయ్యారు. కివీస్ జట్టు కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. దక్షిణాఫ్రికా తరపున మార్కో యాన్సన్ అత్యంత ఖరీదైన బౌలర్గా నిలిచారు. ఆయన 2.5 ఓవర్లలో 18.70 ఎకానమీతో 53 పరుగులు ఇచ్చారు. అలాగే కార్బిన్ బాష్ 2 ఓవర్లలో 35 పరుగులు, కేశవ్ మహారాజ్ 3 ఓవర్లలో 33 పరుగులు, లుంగీ ఎన్గిడి 2 ఓవర్లలో 22 పరుగులు మరియు కగిసో రబాడ 3 ఓవర్లలో 28 పరుగులు సమర్పించుకున్నారు.
