అహ్మదాబాద్ టెస్టులో ఆస్ట్రేలియా భారీస్కోరుకు భారత్ ధీటుగా జవాబిస్తోంది. ఓపెనర్ శుభ్ మన్ గిల్ (Shubman Gill) సెంచరీతో చెలరేగిన వేళ మూడోరోజు టీమిండియాదే పై చేయిగా నిలిచింది. బ్యాటింగ్ కు అనుకూలంగానే ఉండడంతో భారత బ్యాటర్లు సత్తా చాటారు. రోహిత్ శర్మ , గిల్ తొలి వికెట్ కు 78 పరుగులు జోడించారు. రోహిత్ శర్మ 35 పరుగులకు ఔటవగా.. గిల్, పుజారా నిలకడగా ఆడారు. వీరిద్దరి పార్టనర్ షిప్ తో భారత్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. వీరిద్దరూ రెండో వికెట్ కు 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో శుభ్ మన్ గిల్ (Shubman Gill) శతకం సాధించాడు. టెస్టుల్లో ఈ యువ ఓపెనర్ కు ఇది రెండో సెంచరీ. శుభ్ మన్ గిల్ (Shubman Gill) శతకం తర్వాత పుజారా ఔటవడంతో భారత్ 2 వ వికెట్ చేజార్చుకుంది. ఎప్పటిలానే టెస్టుల్లో ఎలా ఆడాలో చూపించిన పుజారా 121 బంతుల్లో 3 ఫోర్లతో 42 పరుగులు చేసాడు. తర్వాత కోహ్లీ, గిల్ ఇన్నింగ్స్ కొనసాగిచారు. వీరిద్దరూ 3వ వికెట్ కు 58 పరుగుల పార్టనర్ షిప్ సాధించారు. గిల్ 12 ఫోర్లు, 1 సిక్సర్ తో 128 రన్స్ కు ఔటయ్యాడు.
ఆ తర్వాత విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో చివరి సెషన్ లోనూ భారత్ ఆధిపత్యం కొనసాగింది. కోహ్లీ దాదాపు 14 నెలల తర్వాత టెస్టుల్లో హాఫ్ సెంచరీ సాధించారు. విరాట్ చివరి సారిగా 2022 జనవరిలో హాఫ్ సెంచరీ చేశాడు. మరోవైపు రవీంద్ర జడేజా తన రొటీన్ బ్యాటింగ్ కు భిన్నంగా అత్యంత నిదానంగా ఆడాడు. కోహ్లీ, జడేజా నాలుగో వికెట్ కు అజేయంగా 44 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. దీంతో మూడోరోజు ఆటముగిసే సమయానికి భారత్ 3 వికెట్లకు 289 పరుగులు చేసింది. కోహ్లీ 128 బంతుల్లో 5 ఫోర్లతో 59 , జడేజా 54 బంతుల్లో 1 సిక్సర్ తో 16 రన్స్ చేసి క్రీజులో ఉన్నారు. టీమిండియా ఇంకా 191 పరుగులు వెనుకబడి ఉంది. పిచ్ బ్యాటింగ్ కే అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినట్టేనని భావిస్తున్నారు. ఒకవేళ నాలుగోరోజు బౌలర్లు ఏమైనా ప్రభావం చూపగలిగితే ఆధిక్యం సాధించిన జట్టుదు పైచేయిగా నిలిచే అవకాశముంది.
Also Read: Teeth: తళతళ మెరిసే పళ్లకోసం ఈ ఆహారాలను తినండి..!