Shikhar Dhawan: టీమ్ ఇండియా మాజీ దిగ్గజ ఓపెనర్ శిఖర్ ధావన్ రెండోసారి వివాహం చేసుకోబోతున్నారు. ధావన్ తన ప్రియురాలు సోఫీ షైన్ను ఫిబ్రవరి మూడో వారంలో వివాహం చేసుకోనున్నారు. సోఫీ షైన్ ఐర్లాండ్ పౌరురాలు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు ‘హిందుస్థాన్ టైమ్స్’ వర్గాలు వెల్లడించాయి. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, అయితే ఈ వేడుకను చాలా ప్రైవేట్గా ఉంచాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
సోఫీ షైన్ ఎవరు?
సోఫీ షైన్ ప్రస్తుతం శిఖర్ ధావన్ గ్రూప్కు చెందిన ‘ది వన్ స్పోర్ట్స్’ ఛారిటీ విభాగం అయిన ‘శిఖర్ ధావన్ ఫౌండేషన్’కు హెడ్గా పనిచేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
వీరిద్దరి సంబంధం గురించి గత కొన్ని నెలలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో స్టాండ్స్లో సోఫీ షైన్తో కలిసి ధావన్ కనిపించడంతో ఈ వార్తలు మొదలయ్యాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, రీల్స్ తరచుగా కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
Also Read: బంగ్లాదేశ్లో దారుణం.. మరో హిందువు కాల్చివేత!
శిఖర్ – సోఫీ ఎక్కడ కలుసుకున్నారు?
శిఖర్- సోఫీ కొన్నేళ్ల క్రితం దుబాయ్లో కలుసుకున్నారు. అక్కడ మొదలైన వారి స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. నివేదికల ప్రకారం.. వీరు గత ఏడాది కాలంగా కలిసి ఉంటున్నారు. శిఖర్ తన కెరీర్లో ఎదుర్కొన్న కీలక సమయాల్లో సోఫీ ఆయన వెంటే ఉన్నారు. IPL 2024 సమయంలో శిఖర్ పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నప్పుడు కూడా సోఫీ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇటీవల ఒక కార్యక్రమంలో శిఖర్ ధావన్ తాను రిలేషన్షిప్లో ఉన్నట్లు ధృవీకరించారు. అయితే అప్పుడు తన భాగస్వామి పేరును మాత్రం వెల్లడించలేదు.
ఆయేషాతో విడాకులు
శిఖర్ ధావన్కు గతంలో ఆయేషా ముఖర్జీతో వివాహం జరిగింది. వీరిద్దరూ 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి జోరావర్ (11 ఏళ్లు) అనే కుమారుడు ఉన్నాడు. అయితే మనస్పర్థల కారణంగా శిఖర్, ఆయేషా విడిపోయారు. అక్టోబర్ 2023లో వీరికి అధికారికంగా కోర్టు విడాకులు మంజూరు చేసింది.
