India vs Bangladesh: చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 186 రన్స్ కే ఆలౌట్

బంగ్లాదేశ్ పర్యటనను భారత్ పేలవంగా ఆరంభించింది.

  • Written By:
  • Updated On - December 4, 2022 / 02:59 PM IST

బంగ్లాదేశ్ పర్యటనను భారత్ పేలవంగా ఆరంభించింది. ఫేవరెట్ గా బరిలోకి దిగిన రోహిత్ సేన తొలి వన్డేలో కేవలం 186 పరుగులకే కుప్పకూలింది. కెఎల్ రాహుల్ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లంతా ఘోరంగా విఫలమయ్యారు. అంచనాలు పెట్టుకున్న రోహిత్ , ధావన్, కోహ్లీ నిరాశపరిచారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఇన్నింగ్స్ ఆద్యంతం తడబడుతూ సాగింది. ఓపెనర్లు ధావన్ 7, కెప్టెన్ రోహిత్ శర్మ 27 పరుగులకే ఔటవగా.. రెండు వారాల బ్రేక్ తర్వాత మైదానంలో అడుగుపెట్టిన కోహ్లీ 9 రన్స్ కే వెనుదిరిగాడు. శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ కాసేపు క్రీజులో నిలవడంతో వికెట్ల పతనం ఆగింది.

అయ్యర్ 24 రన్స్ కు ఔటవగా.. వాషింగ్టన్ సుందర్ 19 రన్స్ చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో పోరాడాడు. దీంతో స్కోర్ 150 దాటగలిగింది. ధాటిగా ఆడిన రాహుల్ 70 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 రన్స్ చేశాడు. రాహుల్ ఔటైన తర్వాత భారత్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. దీంతో టీమిండియా 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబుల్ హసన్ 10 ఓవర్లలో 35 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టగా.. హొస్సేన్ 4 వికెట్లు తీసాడు. ఈ మ్యాచ్ లో గాయం కారణంగా రిషబ్ పంత్ దూరమవడంతో భారత్ వికెట్ కీపర్ గా రాహుల్ వ్యవహరించాడు. అలాగే కుల్ దీప్ సేన్ వన్డే అరంగేట్రం చేశాడు.