Saudi – IPL Franchise : ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల దిశగా అడుగులు వేస్తుండటం పెట్రోలియం ఉత్పత్తులకు ప్రపంచ రాజధానిగా వెలుగొందుతున్న సౌదీ అరేబియాకు కలవరం కలిగిస్తోంది. దీంతో అది వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. ఇప్పటికే మన దేశంలో పలు ప్రముఖ కార్పొరేట్ కంపెనీల్లో సౌదీ అరేబియా సావరిన్ ఫండ్కు స్టాక్ హోల్డింగ్ ఉంది. అపార అవకాశాలు, భారీ జనాభా, అనంతమైన మానవ వనరులు కలిగిన భారత్లో దొరికే ప్రతీ వ్యాపార అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సౌదీ అరేబియా భావిస్తోంది. ఇందులో భాగంగానే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాల్లో సౌదీ ఉంది.
ఎంట్రీకి మార్గం సుగమం చేసేలా..
భారత్లో ఒక ఐపీఎల్ ఫ్రాంఛైజీని కొనుగోలు చేయాలని సౌదీ అరేబియా ప్రధానమంత్రి, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ భావిస్తున్నారట. అయితే ఐపీఎల్లోకి విదేశీ పెట్టుబడులను అనుమతించేలా నిబంధనలు లేనందున.. తన ఎంట్రీకి మార్గం సుగమం చేసేలా నిబంధనలు మార్చాలని భారత ప్రభుత్వాన్నిసౌదీ కోరుతోంది. దీనిపై సౌదీ, భారత ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరులో భారత్లో పర్యటించిన సందర్భంగా సౌదీ యువరాజు ఈ విషయమై భారత ప్రభుత్వంతో చర్చలు జరిపారని సమాచారం అందుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ సహా ప్రొఫెషనల్ క్రీడల్లో సౌదీ అరేబియా భారీగా పెట్టుబడులు కుమ్మరిస్తోంది. ఐపీఎల్ను దాదాపు 2.5 లక్షల కోట్ల విలువైన హోల్డింగ్ కంపెనీగా మార్చడంపై భారత ప్రభుత్వంతో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సలహాదారులు సంప్రదింపులు జరిపినట్టు ‘బ్లూమ్బెర్గ్’లో ఒక వార్తా కథనాన్ని పబ్లిష్ చేసింది. ఐపీఎల్లో దాదాపు 42 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమని సౌదీ అరేబియా అంటోంది. ఐపీఎల్లో సౌదీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అంశంపై వచ్చే ఏడాది లోక్ సభ పోల్స్ తర్వాతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, యూరోపియన్ ఛాంపియన్స్ లీగ్ మాదిరిగానే ఐపీఎల్ను ఇతర దేశాలకు విస్తరించాలని సౌదీ ప్లానింగ్ (Saudi – IPL Franchise) చేస్తోంది.
Also Read: Telangana Election : పోస్టల్ బ్యాలెట్ ఓటు వెయ్యాలి అనుకునేవారు ఈరోజు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు