భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే కెరీర్ ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న హిట్మ్యాన్ భవితవ్యంపై తీవ్రమైన ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇంగ్లండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో దారుణంగా విఫలమవ్వడంతో ఈ చర్చ మరింత ముదిరింది. నిన్న జరిగిన రెండో వన్డేలో 47 బంతుల్లో కేవలం 26 పరుగులు చేసిన తీరు, అతని భవిష్యత్తుపై నెలకొన్న సందేహాలకు మరింత బలాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో ఎల్లుండి ఇంగ్లండ్తో జరగబోయే మూడో వన్డేనే రోహిత్ శర్మకు చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కావచ్చని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ కథనం ప్రకారం.. 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని భారత జట్టు యాజమాన్యం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో 39 ఏళ్ల రోహిత్ను పక్కనపెట్టి, యువ ఆటగాడు యశస్వి జైస్వాల్కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. “సెలక్టర్లు యశస్వి జైస్వాల్కు సుదీర్ఘ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. దాదాపు 20 వన్డేలు ఉన్నాయి. ఆ మ్యాచ్లలో జైస్వాల్కు అవకాశం ఇవ్వాలి. రోహిత్ను రిటైర్ అవ్వమని ఎవరూ చెప్పలేరు, కానీ సెప్టెంబర్లో వెస్టిండీస్తో జరిగే సిరీస్ నుంచి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని సెలక్టర్లు భావిస్తున్నారనేది స్పష్టం. తన భవిష్యత్తుపై రోహిత్ స్వయంగా నిర్ణయం తీసుకోవాలి” అని బీసీసీఐ సెలక్షన్ వ్యవహారాలు తెలిసిన ఒక సీనియర్ అధికారి పీటీఐకి తెలిపారు.
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలోనే ఉండగా, జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు కూడా సెలక్టర్ల నిర్ణయం గురించి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఫామ్, ఫిట్నెస్ కారణంగా విరాట్ కోహ్లీ జట్టులో కొనసాగడం ఖాయమని భావిస్తున్న సెలక్టర్లు, రోహిత్ విషయంలో మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు, ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ కథనం ప్రకారం ఇంగ్లండ్ సిరీస్ తర్వాత తమ భవిష్యత్ ప్రణాళికల్లో రోహిత్ లేడని సెలక్టర్లు అతనికి నేరుగా తెలియజేశారని పేర్కొంది. “ఫిట్నెస్పై ఎంతో దృష్టి పెట్టి, కొనసాగాలని రోహిత్ భావించినప్పటికీ, సెలక్టర్లు ఈ సిరీస్ తర్వాత అతనిని పక్కన పెడుతున్నట్లు స్పష్టం చేశారు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని రోహిత్ విజ్ఞతకే వదిలేశారు” అని ఆ కథనంలో ఓ బీసీసీఐ వర్గం వెల్లడించింది. సెలక్టర్ల ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
గతంలో రోహిత్ టెస్ట్ రిటైర్మెంట్ విషయంలో కూడా సెలక్షన్ కమిటీకి, అతనికి మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు వన్డే ఫార్మాట్లోనూ అదే పునరావృతం అవుతోంది. రోహిత్ను జట్టులో కొనసాగిస్తే, ఫామ్లో ఉన్న జైస్వాల్కు అవసరమైన మ్యాచ్ ప్రాక్టీస్ లభించదనేది సెలక్టర్ల వాదన. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, భారత క్రికెట్లో హిట్మ్యాన్ వన్డే శకం ముగింపునకు వచ్చినట్లే కనిపిస్తోంది.
