Rinku Singh: టీ20 ప్రపంచకప్ 2026 ఆడుతున్న టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రింకూ సింగ్కు తీరని వేదన ఎదురైంది. రింకూ తండ్రి ఖాన్చంద్ర సింగ్ చికిత్స పొందుతూ మరణించారు. కొన్ని రోజుల క్రితమే ఆయన అనారోగ్యానికి గురికావడంతో గ్రేటర్ నోయిడాలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో రింకూ ప్రపంచకప్ మధ్యలోనే ఇంటికి వెళ్లారు. అయితే జింబాబ్వేతో మ్యాచ్కు ముందు తిరిగి జట్టుతో కలిశారు.
అనారోగ్య సమస్యలు
రింకూ సింగ్ టీ20 ప్రపంచకప్ 2026లో బిజీగా ఉన్న సమయంలో ఆయన తండ్రి ఖాన్చంద్ర సింగ్ ఆరోగ్యం విషమించింది. ఆయనకు గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో స్టేజ్ 4 లివర్ క్యాన్సర్కు చికిత్స అందిస్తున్నారు. ఆయనను మెకానికల్ వెంటిలేటర్ సపోర్ట్పై ఉంచి వైద్యులు నిరంతరం చికిత్స అందిస్తూ వచ్చారు.
Also Read: Chandrababu Serious : అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
జింబాబ్వేతో మ్యాచ్కు ముందు తండ్రి ఆరోగ్యం బాగోలేదని తెలియడంతో రింకూ ఇంటికి వెళ్లారు. మ్యాచ్కు ముందు తిరిగి జట్టులో చేరారు. ఖాన్చంద్ర కొంతకాలంగా లివర్ క్యాన్సర్తో పోరాడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణించింది. ఇప్పుడు ఆయన కన్నుమూశారనే వార్త వెలువడింది.
జింబాబ్వేతో మ్యాచ్లో ఆడలేదు
టీ20 ప్రపంచకప్ 2026లో రింకూ సింగ్ ఫినిషర్గా టీమ్ ఇండియాలో కీలక భాగస్వామి. అయితే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో ఆడే అవకాశం రాలేదు. రింకూ మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ చేయలేదు. అలాగే ప్రపంచకప్లో ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేదు. దీంతో ఆయన స్థానంలో సంజూ శాంసన్కు అవకాశం దక్కింది. సంజూ 15 బంతుల్లో 22 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తండ్రి మరణంతో రింకూ సింగ్ జట్టులో అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. దీనిపై బీసీసీఐ (BCCI) త్వరలోనే అధికారిక సమాచారం ఇచ్చే అవకాశం ఉంది.
