WPL టైటిల్ విన్నర్‌గా RCB.. స్మృతి మంధాన ఈ గెలుపు లో జెమీమా రోడ్రిగ్స్ కామెంట్స్‌..!

Smriti Mandhana  ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడబోయే కొద్ది గంటల ముందు.. వివాహం రద్దయ్యింది. అది కూడా రెండు నెలలే. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే.. డిప్రెషన్‌కు లోనవుతారు. బాధ నుంచి బయటపడటానికి ఎంతో సమయం తీసుకుంటారు. కానీ ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన మాత్రం ఎంతో ధైర్యంగా వ్యవహరించారు. తన స్నేహితురాలు జెమీమా, కుటుంబ సభ్యులు ఇచ్చిన భావోద్వేగ సపోర్ట్‌తో ఆ బాధ నుంచి బయటపడటమే కాదు.. వరుసగా రెండోసారి డబ్ల్యూపీఎల్ టైటిల్ సాధించారు. డబ్ల్యూపీఎల్ 2026 […]

Published By: HashtagU Telugu Desk
Smriti Mandhana Jemimah Rodrigues

Smriti Mandhana Jemimah Rodrigues

Smriti Mandhana  ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడబోయే కొద్ది గంటల ముందు.. వివాహం రద్దయ్యింది. అది కూడా రెండు నెలలే. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే.. డిప్రెషన్‌కు లోనవుతారు. బాధ నుంచి బయటపడటానికి ఎంతో సమయం తీసుకుంటారు. కానీ ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన మాత్రం ఎంతో ధైర్యంగా వ్యవహరించారు. తన స్నేహితురాలు జెమీమా, కుటుంబ సభ్యులు ఇచ్చిన భావోద్వేగ సపోర్ట్‌తో ఆ బాధ నుంచి బయటపడటమే కాదు.. వరుసగా రెండోసారి డబ్ల్యూపీఎల్ టైటిల్ సాధించారు.

డబ్ల్యూపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ అమ్మాయిలు అదరగొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ సునాయాసంగా చేధించింది. కెప్టెన్ స్మృతి మంధాన (41 బంతుల్లో 87), జార్జియా వోల్ (54 బంతుల్లో 79) దూకుడుగా ఆడటంతో 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఆర్సీబీ వరుసగా రెండో ఏడాది డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం వరుసగా నాలుగోసారి డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఓటమిపాలైంది.

బెంగళూరు విజయంలో కెప్టెన్ స్మృతి మంధాన కీలక పాత్ర పోషించారు. ఫైనల్లో భారీ లక్ష్య చేధనలో 41 బంతుల్లో 87 రన్స్ చేసిన స్మృతి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. తీవ్ర ఒత్తిడి ఉండే ఫైనల్లో, అదీ ఛేజింగ్‌లో ఇంత దూకుడుగా బ్యాటింగ్ చేయడం సామాన్యమైన విషయం కాదు. అంతే కాదు ఈ డబ్ల్యూపీఎల్ సీజన్లో 377 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గానూ ఆమె నిలిచారు. దీన్ని బట్టి మంధాన ఎంతటి ఫామ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే గత ఏడాది స్మృతి వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 2025 నవంబర్ 23న మహారాష్ట్రలోని సంగ్లీలో పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం జరగాల్సి ఉంది. కానీ పెళ్లికి కొద్ది గంటల ముందు అనూహ్యంగా వివాహం నిలిచిపోయింది. అనంతరం పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. ముందుగా తండ్రి అనారోగ్యం కారణం అని చెప్పినప్పటికీ.. అంతకు మించి ఏదో జరిగిందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

ఇటీవల స్మృతి చిన్ననాటి స్నేహితుడు ఒకరు పలాష్ ముచ్చల్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలాష్ పెళ్లికి ముందు మరో అమ్మాయితో బెడ్ మీద రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే పలాష్ ఈ ఆరోపణలను ఖండించారు. కారణం ఏదైనప్పటికీ.. స్మృతి పెళ్లి మాత్రం ఆగిపోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో మరొకరైతే డిప్రెషన్లోకి వెళ్లిపోతారు. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టడానికే భయపడతారు. కానీ స్మృతి మాత్రం ఈ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. అంతే కాదు ఎంతో వేగంగా ఈ బాధ నుంచి బయట పడ్డారు. వ్యక్తిగత జీవితంలోని పరిణామాలు ప్రొఫెషనల్ గేమ్‌పై ఏమాత్రం ప్రభావం చూపకుండా తను జాగ్రత్తపడ్డారు. బ్యాట్‌తో అద్భుతంగా రాణించడమే కాకుండా.. కెప్టెన్‌గానూ సత్తా చాటి వరుసగా రెండోసారి డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను ఆర్సీబీకి అందించారు. అందుకే విరాట్ కోహ్లి ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.

గత రెండు నెలల్లో స్మృతి ఎంతగా ఇబ్బంది పడిందో ఆమె సహచర మహిళా క్రికెటర్లకు తెలుసు. అందుకే శ్రేయాంక పాటిల్ ఆర్సీబీ టైటిల్ విజయాన్ని తమ కెప్టెన్ స్మృతి మంధానకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.

స్మృతికి అండగా జెమీమా..

స్మృతి మంధాన వివాహం రద్దు చేసుకొని.. తీవ్ర ఒత్తిడిలో, బాధలో ఉన్నప్పుడు జెమీమా రోడ్రిగస్ తనకు అండగా నిలిచారు. స్మృతికి బెస్ట్ ఫ్రెండ్ అయిన జెమీమా.. కష్టకాలంలో తన స్నేహితురాలికి అండగా ఉండటం కోసం.. బిగ్ బాష్ లీగ్‌కు సైతం దూరంగా ఉన్నారు. వీరిద్దరి మధ్య అద్భుతమైన బాండింగ్ ఉంది. ఫైనల్లో ఓటమి తర్వాత జెమీమా బాధతో కంటతడి పెట్టారు. అయితే కష్టాలను దాటొచ్చి టైటిల్ గెలిచిన తన స్నేహితురాలికి లాంగ్ హగ్ ఇచ్చి తన బాధను మర్చిపోవడంతోపాటు.. ఆమె ఆనందంలో తను భాగం పంచుకున్నారు.

మతం విషయంలో జెమీమా మీద గతంలో చాలా ట్రోలింగ్ జరిగింది. అయితే ఆమె సహనంతో వ్యవహరించారు. 2025 నవంబర్ 2న భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ గెలిచింది. అయితే అంతకు ముందు అక్టోబర్ 30న పటిష్టమైన ఆస్ట్రేలియాను సెమీస్‌లో టీమిండియా ఓడించింది. సెమీస్‌లో ఆసీస్ లాంటి జట్టుపై 339 పరుగుల లక్ష్యాన్ని చేధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ జెమీమా అద్భుతం చేశారు. వీరోచిత శతకం బాదిన జెమీమా (127).. భారత జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించారు. అప్పటి వరకూ జట్టులోకి వస్తూ పోతూ ఉన్న జెమీమా.. ఆ తర్వాత మాత్రం స్టార్ ప్లేయర్‌గా మారారు. గత ఏడాది చివర్లో డబ్ల్యూపీఎల్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ పగ్గాలు సైతం ఆమెకు దక్కాయి. 25 ఏళ్ల జమీమా భవిష్యత్తుల్లో భారత జట్టుకు కెప్టెన్‌ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనేది నిపుణుల అంచనా. తను కెప్టెన్ కావచ్చు కాకపోవచ్చు కానీ.. ఓ మంచి స్నేహితురాలిగా స్మృతికి అండగా నిలిచిన తీరు మాత్రం కోట్లాది మంది అభిమానుల మనసుల్ని గెలుచుకుంది. జీవితంలో ఇలాంటి ఫ్రెండ్ ఒక్కరుంటే చాలు కదా.. అని చాలా మంది చెప్పుకోవడం కనిపించింది.

 

 

  Last Updated: 06 Feb 2026, 09:56 AM IST