PM NARENDRA MODI ON SANJU SAMSON టీమిండియా స్టార్ బ్యాటర్, కేరళ ఆటగాడు సంజూ శాంసన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో శాంసన్ కనబరిచిన అద్భుతమైన ఆటతీరును ఆయన కొనియాడారు. కేరళ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, కీలకమైన నాకౌట్ మ్యాచ్లలో శాంసన్ చూపిన ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, పట్టుదల అమోఘమని అన్నారు. జట్టుకు అవసరమైనప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేసేవాడే నిజమైన ఆటగాడని ఆయన అభివర్ణించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ… “ప్రస్తుతం క్రికెట్ సీజన్ నడుస్తోంది. కేరళ ప్రజలు కూడా సంజూ శాంసన్ ప్రదర్శన నుంచి నేర్చుకోవాలి. ప్రపంచకప్లో శాంసన్ ఆటతీరును మనం చూశాం. టోర్నమెంట్లో కీలకమైన నాకౌట్ దశ వచ్చినప్పుడు, అతని ప్రదర్శన ఒక్కసారిగా శిఖర స్థాయికి చేరింది. టోర్నీ ఆరంభం నుంచి ముగింపు వరకు అతని ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతూనే ఉన్నాయి. జట్టుకు అతని అవసరం అత్యంత ఎక్కువగా ఉన్నప్పుడు, అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ఇదే నిజమైన ఆటగాడికి ఉండాల్సిన లక్షణం” అని తెలిపారు.
2026 టీ20 ప్రపంచకప్లో భారత్ విజేతగా నిలవడంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో మొత్తం 5 ఇన్నింగ్స్లలో 80.25 సగటు, 199.37 స్ట్రైక్ రేట్తో 321 పరుగులు సాధించి “ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్” అవార్డును గెలుచుకున్నాడు. ఇందులో 27 ఫోర్లు, 24 సిక్సులు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో ఒకే టీ20 ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ (2014లో 319 పరుగులు) రికార్డును శాంసన్ అధిగమించాడు.
టోర్నీ ఆరంభంలో రెండు మ్యాచ్లలో పెద్దగా రాణించకపోయినా, సూపర్-8 దశ నుంచి శాంసన్ చెలరేగిపోయాడు. వెస్టిండీస్తో జరిగిన కీలక మ్యాచ్లో అజేయంగా 97 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఆ తర్వాత సెమీఫైనల్లో ఇంగ్లండ్పై 89 పరుగులు, ఫైనల్లో న్యూజిలాండ్పై మరో 89 పరుగులతో జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు.
