భారత్-పాక్ మ్యాచ్‌పై సందిగ్ధత.. బహిష్కరణ నిర్ణయంపై పీసీబీ స్పష్టత!

కొలంబోలో జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఐసీసీ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Semi Final Matches

Semi Final Matches

PCB Breaks Silence: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్- పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించగా ఐసీసీ (ICC) మాత్రం పీసీబీతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని చూస్తోంది. భారత్‌తో ఆడేందుకు తమ జట్టుకు అనుమతిని ఇచ్చే ప్రసక్తే లేదని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే బహిష్కరణ నిర్ణయాన్ని మార్చుకునే విషయంపై పీసీబీ ఐసీసీతో చర్చలు ప్రారంభించిందన్న వార్తలపై తాజాగా పాక్ బోర్డు స్పందించింది.

ఐసీసీతో చర్చల వార్తలను ఖండించిన పీసీబీ

బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఐసీసీతో చర్చలు జరుపుతున్నట్లు వస్తున్న వార్తలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధి ఆమిర్ మీర్ కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన ‘X’ (గతంలో ట్విట్టర్)లో స్పందిస్తూ.. “భారత క్రీడా జర్నలిస్టులు చేస్తున్న దావాలను నేను తిరస్కరిస్తున్నాను. పీసీబీ ఐసీసీతో ఎలాంటి చర్చలు జరపలేదు. భారత మీడియాలోని కొందరు వ్యక్తులు కల్పిత గాథలను ప్రచారం చేస్తున్నారు. ఎవరు చర్చలకు ముందుకొచ్చారు, ఎవరు రాలేదు అనేది కాలమే సమాధానం చెబుతుంది” అని పేర్కొన్నారు.

Also Read: సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

ఐసీసీ నుండి పాకిస్థాన్‌కు హెచ్చరికలు?

కొలంబోలో జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఐసీసీ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ద్వారా ఐసీసీతో పాటు స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టర్లకు కోట్లాది రూపాయల ఆదాయం లభిస్తుంది. ఒకవేళ పాకిస్థాన్ ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తే ఐసీసీ ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఏఎఫ్‌పీ (AFP) నివేదించింది. ముఖ్యంగా పీసీబీకి అందాల్సిన కోట్లాది రూపాయల నిధులు నిలిచిపోవచ్చు. భవిష్యత్తులో జరిగే ఐసీసీ టోర్నమెంట్ల నుండి పాక్ జట్టును తప్పించే ప్రమాదం ఉంది. ఈ భారీ నష్టాన్ని నివారించేందుకు చివరి నిమిషంలో పాకిస్థాన్ ప్రభుత్వం తన పట్టు వీడి భారత్‌తో ఆడేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

  Last Updated: 08 Feb 2026, 06:45 PM IST