Site icon HashtagU Telugu

England Cricketer: భార‌త్‌తో టీ20, వ‌న్డే సిరీస్‌.. ఇంగ్లండ్ ప్లేయ‌ర్‌కు వీసా క‌ష్టాలు!

England Cricketer

England Cricketer

England Cricketer: త్వరలో ఇంగ్లండ్‌-భారత్‌ మధ్య టీ20, వన్డే సిరీస్‌ జరగనుంది. ఇందుకోసం ఇంగ్లండ్‌ జట్టు (England Cricketer) భారత్‌లో పర్యటించనుంది. అయితే అంతకు ముందు ఇంగ్లండ్ జట్టులో కాస్త టెన్షన్ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఒక ఇంగ్లండ్ ఆటగాడికి భారతదేశంలో పర్యటించడానికి వీసా లభించలేదు. ఇప్పుడు ఆ ఇంగ్లండ్ ఆట‌గాడు భారతదేశానికి చేరుకోవడం కష్టంగా మారే అవ‌కాశాలు ఉన్న‌ట్లు జ‌ట్టు టెన్ష‌న్ పడుతోంది.

సాకిబ్ మహమూద్‌కు వీసా రాలేదు

భారత్‌తో 5 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టులో సాకిబ్ మహమూద్‌ను సెలెక్ట‌ర్లు జ‌ట్టులో చేర్చారు. కాగా, భారత్‌లో పర్యటించేందుకు సాకిబ్‌కి ఇంకా వీసా లభించలేదు. సాకిబ్ మహమూద్ పాకిస్థాన్ మూలానికి చెందినవాడు. ఇప్పుడు ఈ ఆటగాడు భారత్‌పై ఆడగలడా లేదా అనే సందేహం ఉంది.

Also Read: Minister Ponnam: సామాన్య భ‌క్తుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా క్యూలైన్‌లో వెళ్లిన మంత్రి

డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. సాకిబ్ మహమూద్‌కు భారత్‌ను సందర్శించడానికి ఇంకా వీసా రాలేదు. కుడిచేతి ఫాస్ట్ బౌలర్ UAEకి వెళ్లాల్సి ఉంది. అక్కడ అతను లెజెండరీ జేమ్స్ ఆండర్సన్ పర్యవేక్షణలో నిర్వహించే శిబిరంకు సహచర ఫాస్ట్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్సే, మార్క్ వుడ్‌లతో కలిసి వెళ్లనున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో చల్లని పరిస్థితుల్లో బౌలింగ్ చేయలేని కారణంగా పరిస్థితులకు అనుగుణంగా ఈ శిబిరం నిర్వహిస్తున్నారు.

సకిబ్ మహమూద్ వీసా పొందడంలో విఫలమైనందున అతని విమానాన్ని ఇంగ్లాండ్.. వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) రద్దు చేసినట్లు నివేదిక పేర్కొంది. 27 ఏళ్ల ఆటగాడు సిరీస్‌లో పాల్గొనడానికి భారత్‌కు వెళ్లగలడా అనేది అస్పష్టంగా ఉంది. ఈ విషయంపై ఈసీబీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

గ‌తంలో కూడా ఇలాంటి ఘ‌ట‌న‌

పాకిస్థానీ సంతతికి చెందిన ఓ ఇంగ్లండ్ క్రికెటర్ ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. 2024 సంవత్సరంలో భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగిన 5-మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో షోయబ్ బషీర్ కూడా వీసా పొందడంలో ఆలస్యం అయ్యాడు. ఈ కారణంగా అతను సిరీస్‌లోని ఒక మ్యాచ్‌ను కోల్పోవలసి వచ్చింది.