Mohammed Siraj : ఐపీఎల్ 16వ సీజన్ హోరాహోరీగా సాగుతోంది. మ్యాచ్ లు చివరి బంతి వరకూ ఉత్కంఠ భరితంగా జరుగుతూ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే ఓ అజ్ఞాత వ్యక్తి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ కు కాల్ చేయడం ఇప్పుడు కలకలం రేపింది. ఆ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ ఎవరో కాదు.. హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj). ఓ అజ్ఞాత వ్యక్తి సిరాజ్కు ఫోన్ చేసి ఆర్సీబీకి సంబంధించిన విషయాలు అడిగినట్లు సమాచారం.దీనిపై సిరాజ్ గతవారం బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ కు ఫిర్యాదు చేసినట్లు పీటీఐ వెల్లడించింది. అయితే సిరాజ్ను సంప్రదించింది బుకీ కాదని, హైదరాబాద్కు చెందిన ఓ డ్రైవర్ అని విచారణలో తేలింది. ఈ విషయంలో బీసీసీఐ వెంటనే చర్యలు చేపట్టింది.
సిరాజ్ను సంప్రదించింది బుకీ కాదనీ, బెట్టింగ్లకు అలవాటు పడిన ఓ హైదరాబాద్ డ్రైవర్ అనీ బీసీసీఐ సన్నిహిత వర్గాలు తెలిపాయి. బెట్టింగ్లో అతడు చాలా మేర డబ్బు పోగొట్టుకున్నాడనీ, ఈ క్రమంలో అతడు సిరాజ్ను సంప్రదించి ఆర్సీబీ అంతర్గత విషయాలు అడిగినట్టు తెలుస్తోంది.
ఈ విషయాన్ని వెంటనే సిరాజ్ (Mohammed Siraj) బీసీసీఐ ఏసీయూకి చెప్పడంతో… దర్యాప్తు సంస్థలు ఆ వ్యక్తిని పట్టుకున్నాయని బోర్డు వర్గాలు తెలిపాయి.
ఆ వ్యక్తి సంప్రదింపులు జరిపిన వెంటనే మహ్మద్ సిరాజ్- అప్రమత్తం అయ్యాడని, ఈ సమాచారాన్ని తమకు చేరవేశాడని బీసీసీఐ ఏసీయూ అధికారికంగా తెలిపింది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని, అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొంది. కాగా- మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) స్వస్థలం కూడా హైదరాబాదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాగా గతంలో శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీమాల్ ఫిక్సింగ్ ఉచ్చులో పడి కెరీర్ను నాశనం చేసుకున్నారు. ఈ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు రెండేళ్ల పాటు నిషేధం కూడా ఎదుర్కొన్నాయి. అప్పటి నుంచి బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ పూర్తి నిఘా ఉంచింది. ఆటగాళ్లను బయటి వ్యక్తులు ఎవరూ కలవకుండా పూర్తి ఆంక్షలు విధించింది. అలాగే జట్టుకు సమాచారం ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా బయటకు వెళ్లకూడదు. అయినప్పటికీ అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: Food Habits: టెక్ బిలియనీర్ల క్రేజీ ఫుడ్ హ్యాబిట్స్ చిట్టా ఇదిగో..