బెంగళూరులోని ప్రసిద్ధ ఎం.చిన్నస్వామి స్టేడియం భద్రతా వైఫల్యంతో ఒక్కసారిగా వార్తల్లోకిెక్కింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరగాల్సిన కీలక మ్యాచ్కు ముందు స్టేడియంలోని నిఘా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. స్టేడియం నలుమూలలా అమర్చిన సుమారు 240 సీసీటీవీ కెమెరాల కనెక్షన్లను గుర్తుతెలియని వ్యక్తులు కట్ చేయడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వేలాది మంది ప్రేక్షకులు తరలివచ్చే హై-ప్రొఫైల్ మ్యాచ్ కావడంతో, కెమెరాలు పని చేయకపోవడం స్టేడియం భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది.
నిందితులు ఎవరో తెలిసి షాక్
ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఈ ఘాతుకానికి పాల్పడింది బయట వ్యక్తులు కాదు, స్టేడియంలోనే పనిచేసే సర్వైలెన్స్ టీమ్కు చెందిన మంజునాథ్ మరియు అబ్దుల్ అని గుర్తించారు. వీరిద్దరూ గత కొంతకాలంగా అక్కడ సిబ్బందిగా పనిచేస్తున్నారు. సుమారు రూ. 10 లక్షల మేర తమకు రావాల్సిన వేతన బకాయిల విషయంలో యాజమాన్యంతో గొడవ జరిగిందని, ఆ కోపంతోనే నిఘా వ్యవస్థను దెబ్బతీశామని నిందితులు ప్రాథమిక విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తమ డిమాండ్లను పట్టించుకోకపోవడంతోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పోలీసుల విచారణ వేగవంతం
భద్రతా లోపాన్ని గుర్తించిన వెంటనే అప్రమత్తమైన అధికారులు, టెక్నికల్ టీమ్ సాయంతో యుద్ధప్రాతిపదికన కనెక్షన్లను బాగు చేశారు. మ్యాచ్ ప్రారంభ సమయానికి స్టేడియంలోని నిఘాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రస్తుతం పోలీసులు నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కేవలం వేతన బకాయిల కోసమే ఈ పని చేశారా లేక దీని వెనుక మరేదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కీలకమైన ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
