ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ మరో హై ఓల్టేజీ మ్యాచ్ జరుగనుంది. విధ్వంసకర హిట్టర్లతో నిండిన రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఇవాళ అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో లక్నో గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకోనుండగా.. ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అగ్నిపరీక్షగా మారింది.
ప్రస్తుత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్ల్లో 7 విజయాలతో మూడో స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 15వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తును పక్కా చేసుకోగా.. మిగిలిన మూడు స్థానాల కోసం లక్నో , రాజస్థాన్, ఆర్సీబీ , ఢిల్లీ, పంజాబ్, కేకేఆర్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇదే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ -లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరి వరకు హోరాహోరీగా సాగింది.
ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు తొలుత 6 వికెట్ల నష్టానికి 165పరుగులు చేయగా.. ఛేదనలో లక్నో జట్టు చివరి వరకు పోరాడి 162 పరుగులు చేయగలిగింది. ఈ క్రమంలో ఈరోజు మ్యాచ్లో లక్నో గెలిచి.. రాజస్థాన్పై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. ఇక పిచ్ విషయానికొస్తే బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉంది. రాత్రి మ్యాచ్ అయినప్పటికీ కూడా టాస్ కీలకంగా మారే అవకాశం లేదని భావిస్తున్నారు. గత కొన్ని మ్యాచ్ ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు కూడా విజయం సాధిస్తున్న నేపథ్యంలో మరో హోరా హోరీ పోరును అభిమానులు చూడొచ్చు.