IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఒక గొప్ప శుభవార్త అందింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన RCB తన సొంత మైదానమైన బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో మళ్ళీ తన మెజారిటీ హోమ్ మ్యాచ్లను ఆడబోతోంది. ఈ సీజన్లో మొత్తం 5 హోమ్ మ్యాచ్లను బెంగళూరులో ఆడుతుండగా మిగిలిన 2 మ్యాచ్లను రాయ్పూర్లో నిర్వహించనున్నట్లు ఫ్రాంచైజీ స్పష్టం చేసింది.
గత సీజన్ చేదు జ్ఞాపకాల తర్వాత
గత సీజన్లో జట్టు ట్రోఫీ గెలిచిన తర్వాత స్టేడియం బయట జరిగిన దురదృష్టకర తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ విషాద ఘటన తర్వాత ఈ మైదానంలో ఎటువంటి పెద్ద దేశీయ టోర్నీలు (రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ లేదా మహారాజా ట్రోఫీ వంటివి) నిర్వహించలేదు. దీనివల్ల IPL 2026లో RCB అక్కడ ఆడుతుందా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
Also Read: షాకింగ్ ఘటన..వామ్మో త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ వ్యక్తి
అనుమతులు లభించాయి
తాజాగా ఫ్రాంచైజీ ఈ విషయాన్ని ప్రకటించింది. సుదీర్ఘ ప్రక్రియ, అన్ని అవసరమైన అనుమతులు పొందిన తర్వాత బెంగళూరులో మ్యాచ్లు ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రభుత్వం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) పోలీసు అధికారుల సహకారంతో భద్రత, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు RCB తన అధికారిక ప్రకటనలో పేర్కొంది.
మ్యాచ్ల వివరాలు
బెంగళూరు: RCB తన ఐదు ప్రధాన హోమ్ మ్యాచ్లను ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఆడుతుంది.
రాయ్పూర్: మిగిలిన రెండు హోమ్ మ్యాచ్లను రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహించనున్నారు.
RCB సీఈఓ రాజేష్ మీనన్ మాట్లాడుతూ.. “చిన్నస్వామి కేవలం ఒక మైదానం మాత్రమే కాదు. అది మా జట్టుకు ఒక గుర్తింపు. ఇక్కడి ప్రేక్షకుల ఉత్సాహం ఆటగాళ్లకు ఎప్పుడూ గొప్ప ప్రేరణ అని అన్నారు. కష్టకాలంలో జట్టుకు మద్దతుగా నిలిచిన అభిమానులకు, అలాగే సహకరించిన ప్రభుత్వం, కేఎస్సీఏ, పోలీసు శాఖకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
విరాట్ కోహ్లీ ‘హోమ్’ కమ్ బ్యాక్
IPL 2026లో చిన్నస్వామిలో మ్యాచ్లు జరగడం వల్ల మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే… విరాట్ కోహ్లీ ‘హోమ్’ రాక. కోహ్లీకి ఈ మైదానంతో ప్రత్యేక అనుబంధం ఉంది. బెంగళూరు ప్రేక్షకులు అతనికి ఎప్పుడూ ఘనస్వాగతం పలుకుతారు. ఈ సీజన్లో స్టేడియం మళ్ళీ “కోహ్లీ-కోహ్లీ” నామస్మరణతో మార్మోగడం ఖాయంగా కనిపిస్తోంది.
