ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం ఫైనల్ మ్యాచ్ కోసం ఎర్రమట్టి, నల్లమట్టి మిశ్రమంతో కూడిన ‘మిక్స్డ్ సాయిల్’ పిచ్ను ఉపయోగిస్తున్నారు. ముంబైలో ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్ తరహాలోనే ఇది కూడా హై-స్కోరింగ్ మ్యాచ్కు వేదిక కానుంది. ముఖ్యంగా ఈ పిచ్లో నల్లమట్టి కంటే ఎర్రమట్టిని ఎక్కువగా వాడారు. ఎర్రమట్టి కారణంగా పిచ్పై బంతికి మంచి బౌన్స్ లభిస్తుంది. దీంతో రెండు ఇన్నింగ్స్లలోనూ బ్యాటింగ్ సులువుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్పిన్నర్లకు పెద్దగా సహకారం లభించకపోవచ్చని, ఈ పిచ్పై 200 పరుగులు సాధారణ స్కోర్గా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ వ్యూహాత్మక నిర్ణయం వెనుక బలమైన కారణాలున్నాయి. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమికి నెమ్మదైన నల్లమట్టి పిచ్ ఒక కారణంగా నిలిచింది. అంతేకాకుండా ప్రస్తుత టోర్నీలో దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లోనూ పిచ్ స్వభావం కారణంగా టీమిండియా భారీ తేడాతో ఓడిపోయింది. ఈ పరాజయాలను ఒక గుణపాఠంగా తీసుకున్న గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని భారత జట్టు యాజమాన్యం, ఫైనల్ పిచ్ విషయంలో ముందుగానే అప్రమత్తమైంది. లీగ్ దశలో కొన్ని పిచ్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మేనేజ్మెంట్, స్థానిక క్యూరేటర్లతో చర్చించి తమ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేసినట్లు తెలుస్తోంది.
“ఫైనల్ కోసం క్రీడాస్ఫూర్తినిచ్చే పిచ్ను అందిస్తారు. ఇందులో ఏ ఒక్క జట్టుకూ అనవసర ప్రయోజనం ఉండదు. ఎర్రమట్టి ఎక్కువగా ఉండటంతో బౌన్స్ లభిస్తుంది, అదే సమయంలో బ్యాటర్లకు పూర్తి అనుకూలంగా ఉంటుంది” అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పిచ్ టీమిండియా దూకుడైన బ్యాటింగ్ శైలికి సరిగ్గా సరిపోతుందని, సంజూ శాంసన్ వంటి మిడిలార్డర్ బ్యాటర్లు కీలక పాత్ర పోషించడానికి ఆస్కారం కల్పిస్తుందని భావిస్తున్నారు. ఈ టోర్నీలో ఈ మైదానంలో దక్షిణాఫ్రికా 213 పరుగులు చేసి కెనడాపై గెలిచింది. దీంతో ఫైనల్ మ్యాచ్ పరుగుల వరద పారించడం ఖాయంగా కనిపిస్తోంది.
