ఖతార్ వేదికగా జరుగుతున్న సాకర్ ప్రపంచ కప్ సంచలనాల మోతతో హోరెత్తిపోతోంది. మొన్న అర్జెంటీనాకు సౌదీ అరేబియా షాకిస్తే.. తాజాగా జపాన్ టైటిల్ ఫేవరెట్ జర్మనీపై సంచలన విజయం సాధించింది. ఈ విజయంతో జపాన్ సాకర్ ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత జపాన్ ఫ్యాన్స్ చేసిన పని అందరి మనసులూ గెలుచుకుంది. తమ సెలబ్రేషన్ టైం లో ఫాన్స్ ఎంతలా హంగామా చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక స్టేడియంలో వాళ్లు వేసే చెత్త, ఇతర వస్తువులు పడేసే విషయం అందరికీ తెలిసిందే.
తర్వాత స్టేడియం శుభ్రం చేయడం సిబ్బందికి అంత ఈజీ కాదు. అయితే జపాన్ ఫ్యాన్స్ మాత్రం స్వయంగా శుభ్రం చేశారు. ఎక్కడా కూడా చిన్న కాగితం, చెత్త లేకుండా స్టేడియం మొత్తం క్లీన్ చేసేశారు. ప్రస్తుతం వీరు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జపాన్ ఫ్యాన్స్ పై పలువురు ప్రశంసించారు. అందరూ వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదిలా ఉంటే ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సాగిన ఈ మ్యాచ్లో జపాన్ 2-1 తేడాతో జర్మనీపై విజయం సాధించింది. జపాన్ ఆటగాడు టకుమా అసానో చివర్లో గోల్ సాధించి తమ జట్టును గెలిపించాడు. దీంతో నాలుగు సార్లు వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జర్మనీకి తొలి మ్యాచ్లోనే పరాభవం తప్పలేదు.జర్మనీ ఈ విధంగా ఆరంభం మ్యాచ్లో పరాజయం పాలవ్వడం ఇదే మొదటి సారి కాదు. గతంలో 2018 ఫిఫా వరల్డ్ కప్లోనూ తొలి రౌండులో ఓడిపోయింది.