Deepika Kumari : మెక్సికోలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్కు మరో పతకం దక్కింది. మన దేశానికి చెందిన ఆర్చర్ దీపికా కుమారికి ఆర్చరీ వరల్డ్ కప్లో రజత పతకం లభించింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో చైనా క్రీడాకారిణి లి జియామన్తో దీపికా కుమారి(Deepika Kumari) తలపడింది.
Also Read :Waking Benefits: ఉదయం త్వరగా నిద్ర లేస్తే ఎన్ని లాభాలో తెలుసా..?
అయితే ఈ మ్యాచ్లో లి జియామన్ చేతిలో 0-6 తేడాతో దీపిక ఓడిపోయింది. దీంతో ఆమె రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటివరకు ఆర్చరీ వరల్డ్ కప్లలో దీపిక సాధించిన ఆరో రజత పతకం ఇది.అంతకుముందు మ్యాచ్ల విషయానికి వస్తే.. క్వార్టర్ ఫైనల్స్లో చైనా ప్లేయర్ యాంగ్ షియావోలీని 6-0 తేడాతో దీపిక ఓడించింది. సెమీ ఫైనల్స్లో మెక్సికోకు చెందిన అలెజాండ్రా వాలెనికాను 6-4 పాయింట్ల తేడాతో దీపిక ఓడించింది.
Also Read :India Squad: తదుపరి టెస్టులకు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ.. నెక్స్ట్ టెస్టుకు వీరు డౌటే?
ఇక చైనా క్రీడాకారిణి లి జియామన్ విషయానికి వస్తే.. ఆమె తన మొదటి ప్రయత్నంలోనే ఆర్చరీ వరల్డ్ కప్లో గోల్డ్ మెడల్ను సాధించడం విశేషం. ఈ టోర్నమెంటులో టాప్ -8 ఆర్చర్లను లి జియామన్ మట్టికరిపించి బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ‘‘నేను నా ఉత్తమ ఆటతీరును కనబర్చేందుకు ప్రయత్నించాను. నా ప్రతీ బాణం సరిగ్గా, కచ్చితంగా లక్ష్యాన్ని తాకాలనే పట్టుదలతో ముందుకు సాగాను. నేను అనుకున్న విధంగానే జరిగింది. గెలవాలి.. ఓడిపోవాలి అనే అంశాలను నా మెదడులోకి రానివ్వలేదు’’ అని చైనా క్రీడాకారిణి లి జియామన్ చెప్పుకొచ్చింది. మొత్తం మీద ఈసారి ఆర్చరీ వరల్డ్ కప్ హోరాహోరీగా జరిగింది. వివిధ దేశాల ప్లేయర్లు పోటాపోటీగా తలపడ్డారు. ఎంతోమంది కొత్త ప్లేయర్ల ట్యాలెంట్ బయటికి వచ్చింది.