Shardul Thakur: ముంబైలో ఘనంగా శార్దూల్ ఠాకూర్ వివాహం.. స్నేహితురాలినే పెళ్లాడిన క్రికెటర్

భారత జట్టు ఆటగాడు శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) వివాహ బంధంతో ఓ ఇంటివాడయ్యాడు. శార్దూల్ తన స్నేహితురాలు మిథాలీ పారుల్కర్‌ను సోమవారం ముంబైలో వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ మరాఠీ సంప్రదాయాలతో వివాహం చేసుకున్నారు.

  • Written By:
  • Publish Date - February 28, 2023 / 01:05 PM IST

భారత జట్టు ఆటగాడు శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) వివాహ బంధంతో ఓ ఇంటివాడయ్యాడు. శార్దూల్ తన స్నేహితురాలు మిథాలీ పారుల్కర్‌ను సోమవారం ముంబైలో వివాహం చేసుకున్నాడు. మరాఠీ సంప్రదాయాలతో వివాహం చేసుకున్నారు. ఈ సమయంలో వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు భారత జట్టులో ముగ్గురు ఆటగాళ్లు పెళ్లి చేసుకున్నారు. మొదట KL రాహుల్, అతియా శెట్టిల వివాహం జరిగింది. దీని తర్వాత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్- మేహాను వివాహం చేసుకున్నాడు.

ఇప్పుడు శార్దూల్ ఠాకూర్ చాలా కాలం పాటు డేటింగ్ చేసిన తర్వాత స్నేహితురాలు మిథాలీ పారుల్కర్‌ను వివాహం చేసుకున్నాడు. శార్దూల్ ఠాకూర్, అతని స్నేహితురాలు మిథాలీ పారుల్కర్ 2021 సంవత్సరంలో నిశ్చితార్థం చేసుకున్నారు. వారిద్దరికీ ముంబైలో నిశ్చితార్థం జరిగింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఇద్దరూ T20 వరల్డ్ తర్వాత 2022 సంవత్సరంలో వివాహం చేసుకోవలసి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల తేదీని వాయిదా వేయవలసి వచ్చింది. ఆ తర్వాత ఫిబ్రవరి 27న వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

Also Read: Air India: ఎయిర్ ఇండియాలో విలీనం కానున్న విస్తారా ఎయిర్‌లైన్స్

బంధువులు, స్నేహితులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. ముంబైలో అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. క్రికెటర్ దీపక్ చాహర్ భార్య మాల్తీ చాహర్ కూడా వివాహ వేడుకలో కనిపించింది. కేకేఆర్ టీమ్ మేనేజ్‌మెంట్ సభ్యుడు అభిషేక్ నాయర్, ముంబై ప్లేయర్ సిద్ధేష్ లాడ్ కూడా శార్దూల్ ఠాకూర్ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. మిథాలీ పారుల్కర్ ది బేక్స్ పేరుతో బేకరీ ఫుడ్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఆల్ ది జాజ్ లగ్జరీ బేకర్స్ సంస్థ ద్వారా ముంబైలో వ్యాపారాలను నిర్వహిస్తోంది.

కాగా.. పెళ్లి కారణంగా శార్దూల్ ఠాకూర్ ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే, ఆసీస్‌తో వన్డే సిరీస్ కు శార్దూల్ జట్టులో చేరతాడని సమాచారం. మార్చి 1 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. రెండో టెస్టు తర్వాత చాలా విరామం ఉంది. అందుకే రోహిత్ శర్మ స్వయంగా ఈ వివాహంలో భాగం అయ్యాడు.