India vs Australia: విశాఖలో భారత్‌, ఆసీస్ వన్డే. టిక్కెట్లు అమ్మకం ఎప్పుడంటే?

భారత్, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌ త్వరలోనే ముగియబోతోంది. అనంతరం రెండు జట్లూ మూడు వన్డేల సిరీస్ ఆడనుండగా.. వీటిలో ఒక మ్యాచ్‌కు విశాఖ ఆతిథ్యమిస్తోంది.

భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) టెస్ట్ సిరీస్‌ త్వరలోనే ముగియబోతోంది. అనంతరం రెండు జట్లూ మూడు వన్డేల సిరీస్ ఆడనుండగా.. వీటిలో ఒక మ్యాచ్‌కు విశాఖ ఆతిథ్యమిస్తోంది. దీనికి సంబంధించిన టిక్కెట్ల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చాలా కాలం తర్వాత ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండడంతో ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఫ్యాన్స్ ఉత్సాహంతో ఉన్నారు. తాజాగా విశాఖ వన్డేకు సంబంధించిన టిక్కెట్ల అమ్మకంపై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రకటన చేసింది. మార్చి 10 నుంచి వన్డే టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్‌రెడ్డి చెప్పారు. ఆఫ్‌లైన్‌లో మార్చి 13 నుంచి టిక్కెట్లు విక్రయించనున్నారు. టిక్కెట్ల ధరలను రూ.600 ,రూ.1500, రూ.2000, రూ.3000, రూ.3500, రూ.6000గా నిర్ణయించారు. విశాఖ స్టేడియంలో ఇప్పటి వరకూ 10 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. చివరి సారి 2019లో వెస్టిండీస్‌తో భారత్ తలపడింది. గత ఏడాది ఇదే స్టేడియంలో భారత్, సౌతాఫ్రికా మధ్య టీ ట్వంటీ జరిగింది.

కాగా విశాఖ స్టేడియం టీమిండియాకు (Team India) బాగా కలిసొచ్చింది. గత రికార్డుల్లో ఇక్కడ భారత్‌దే పైచేయిగా ఉంది. 10 వన్డేల్లో కేవలం ఒకసారి మాత్రమే టీమిండియా పరాజయం పాలవగా.. 7 మ్యాచ్‌లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టైగా ముగిస్తే.. మరొకటి వర్షంతో రద్దయింది. వన్డే ప్రపంచకప్‌కు జట్టు కూర్పుపై దృష్టి సారించిన టీమ్ మేనేజ్‌మెంట్‌ ఈ సిరీస్‌లో యువ, సీనియర్ క్రికెటర్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. మార్చి 17 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుండగా.. తొలి మ్యాచ్‌కు ముంబై వాంఖడే స్టేడియం వేదిక కానుంది. మార్చి 19న రెండో వన్డే విశాఖలో జరగనుండగా.. మార్చి 22న చెపాక్ స్టేడియంలో చివరి మ్యాచ్ జరగనుంది. అయితే వన్డే సిరీస్‌కు పూర్తి స్థాయి జట్టునే ఎంపిక చేసినప్పటకీ.. నిలకడగా రాణిస్తున్న పలువురు యువక్రికెటర్లు కూడా చోటు దక్కించుకున్నారు. వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్‌శర్మ అందుబాటులో ఉండడం లేదు. దీంతో హార్థిక్ పాండ్యా సారథిగా వ్యవహరించనున్నాడు.

Also Read:  Pushpa 2: ‘పుష్ప2’ లో సాయి పల్లవి నటిస్తుందా?