Ind Vs SA 1st ODI:వ‌న్డే సిరీస్‌పై గురి.. నేడు సౌతాఫ్రికాతో మొద‌టి వ‌న్డే..!

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కైవ‌సం చేసుకున్న టీమిండియా ఇప్పుడు మ‌రో సిరీస్‌పై క‌న్నేసింది.

  • Written By:
  • Publish Date - October 6, 2022 / 06:30 AM IST

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కైవ‌సం చేసుకున్న టీమిండియా ఇప్పుడు మ‌రో సిరీస్‌పై క‌న్నేసింది. ఇప్ప‌టికే టీ20 సిరీస్ ఖాతాలో వేసుకోగా..వ‌న్డే సిరీస్‌ను కూడా సాధించాల‌ని ధావ‌న్ కెప్టెన్సీలోని భార‌త్ జ‌ట్టు భావిస్తోంది. ల‌క్నో వేదిక‌గా జ‌ర‌గనున్న మొద‌టి వ‌న్డేలో సౌతాఫ్రికాతో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది. అయితే సౌతాఫ్రికాతో జ‌ర‌గబోయే ఈ మూడు మ్యాచ్‌ల‌ వ‌న్డే సిరీస్‌ను భార‌త్ ద్వితీయ శ్రేణి జ‌ట్టు ఆడ‌బోతుంది.

రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలోని టీమిండియా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్ల‌నుంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆస్ట్రేలియా వేదిక‌గా అక్టోబ‌ర్ 16 నుంచి ప్రారంభంకానుంది. ఇప్ప‌టికే దక్షిణాఫ్రికా జ‌ట్టుతో జరిగిన టీ20 సిరీస్‌లో రోహిత్ నేతృత్వంలోని టీమిండియా 2-1తో టీ20 సిరీస్ కైవ‌సం చేసుకుంది. సౌతాఫ్రికాతో మొత్తం మూడు వ‌న్డేల‌ను ధావ‌న్ కెప్టెన్సీలోని టీమిండియా ఆడ‌నుంది. మొద‌టి వ‌న్డే మ్యాచ్ అక్టోబ‌ర్ 6న‌, రెండో వ‌న్డే మ్యాచ్ అక్టోబ‌ర్ 9న‌, మూడో వ‌న్డే అక్టోబ‌ర్ 11న జరగనుంది.

సౌతాఫ్రికా వ‌న్డే సిరీస్ ఎంపికైన భార‌త్ జ‌ట్టు: శిఖర్ ధావన్‌ (కెప్టెన్), శ్రేయస్‌ అయ్యర్ (వైస్ కెప్టెన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభమన్‌ గిల్‌, రజత్ పాటిదార్‌, రాహుల్‌ త్రిపాఠి, ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌, షబాజ్‌ అహ్మద్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, రవి బిష్ణోయ్‌, ముకేశ్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌, మహమ్మద్‌ సిరాజ్‌, దీపక్‌ చాహర్‌.