IND vs WI: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో భాగంగా భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన కీలక పోరులో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఛేజింగ్లో టీమిండియా చివరి ఓవర్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది.
వెస్టిండీస్ భారీ స్కోరు
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్కు శుభారంభం లభించింది. కెప్టెన్ షాయ్ హోప్ 32 పరుగులు చేయగా, మరో ఓపెనర్ రోస్టన్ చేజ్ 40 పరుగులతో మెరిశారు. వన్డౌన్లో వచ్చిన షిమ్రాన్ హెట్మైర్ 27 పరుగులు జోడించారు. షెర్ఫేన్ రూథర్ఫర్డ్ 14 పరుగులకే పరిమితం కాగా, చివర్లో రోవ్మన్ పావెల్ (నాటౌట్ 34), జేసన్ హోల్డర్ (నాటౌట్ 37) ధాటిగా ఆడటంతో వెస్టిండీస్ భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ సాధించారు.
Also Read: భారత్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని పరుగుల తేడాతో గెలవాలో తెలుసా?!
సెమీఫైనల్లో భారత్
196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభం సరిగా దక్కలేదు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ త్వరగానే పెవిలియన్ చేరారు. అయితే సంజూ శాంసన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి 50 బంతుల్లో 97 పరుగులతో (12 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయంగా నిలిచారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 18 పరుగులు, తిలక్ వర్మ 27 పరుగులు చేయగా, చివర్లో హార్దిక్ పాండ్యా 17 పరుగులతో కీలక సహకారం అందించారు. ఫలితంగా టీమిండియా చివరి ఓవర్లో విజయాన్ని అందుకుంది. వెస్టిండీస్ బౌలర్లలో షమర్ జోసెఫ్, జేసన్ హోల్డర్ తలా 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో టీమిండియా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది.
