IND vs NZ Final: భారత్- న్యూజిలాండ్ మధ్య టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ ఈరోజు అంటే ఆదివారం మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అయితే ఒకవేళ అహ్మదాబాద్లో వర్షం పడి మ్యాచ్ రద్దయితే ఛాంపియన్ ఎవరు అవుతారనే ప్రశ్న అభిమానుల మదిలో మెదులుతోంది. వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దయితే ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి? ట్రోఫీని ఎవరు గెలుచుకుంటారు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఒకవేళ వర్షం పడితే నిబంధనలు ఏం చెబుతున్నాయి?
మార్చి 8, ఆదివారం నాడు అహ్మదాబాద్లో ఫైనల్ జరగనుంది. ఒకవేళ వర్షం పడితే అంపైర్లు వేచి చూస్తారు. కట్-ఆఫ్ టైమ్ (Cut-off time) ముగిసేలోపు కనీసం 10 ఓవర్ల ఆట ఆడించేందుకు ప్రయత్నిస్తారు. ఒకవేళ 10 ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యం కాకపోతే రిజర్వ్ డే (Reserve Day) నిబంధన అమలులోకి వస్తుంది. ఐసీసీ ఇప్పటికే 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కోసం రిజర్వ్ డేని కేటాయించింది.
Also Read: మరికాసేపట్లో భారత్- న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్.. ఎక్కడ చూడాలంటే?!
రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడితే పరిస్థితి ఏంటి?
ఫైనల్ రోజు వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోతే రిజర్వ్ డే నాడు మ్యాచ్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఉదాహరణకు టాస్ పడకుండానే మ్యాచ్ రిజర్వ్ డేకి వెళ్తే, టాస్తోనే ఆట మొదలవుతుంది. అయితే రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడి మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాకపోతే ఏం జరుగుతుంది? అప్పుడు ఐసీసీ నిబంధనల ప్రకారం.. రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. గతంలో 2002 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్- శ్రీలంకను ఇలాగే ఉమ్మడి విజేతలుగా ప్రకటించారు.
అహ్మదాబాద్ వాతావరణ నివేదిక
ఆదివారం, మార్చి 8న అహ్మదాబాద్లో వర్షం కురిసే అవకాశం అస్సలు లేదు. ఇది ఇరు జట్లతో పాటు అభిమానులకు కూడా శుభవార్త. నివేదికల ప్రకారం.. వర్షం కురిసే అవకాశం 0 శాతం మాత్రమే. తేమ 12 శాతం ఉండే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 8 కిలోమీటర్లు ఉండనున్నట్లు సమాచారం.
