IND vs NED: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా జరిగిన 36వ మ్యాచ్లో భారత్, నెదర్లాండ్స్ జట్లు తలపడ్డాయి. తమ చివరి లీగ్ దశ మ్యాచ్లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తూ నెదర్లాండ్స్ను 17 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంలో టీమ్ ఇండియా ఆల్రౌండర్ శివమ్ దూబే మెరుపు అర్థసెంచరీతో కీలక పాత్ర పోషించగా, బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలంతో ఆకట్టుకున్నాడు.
భారత్ భారీ స్కోరు
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అయితే, భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ మ్యాచ్ ఆరంభమైన మొదటి బంతికే ‘గోల్డెన్ డక్’గా వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ 7 బంతుల్లో 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ (31 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (34 పరుగులు) చేసి ఇన్నింగ్స్ను నిలబెట్టారు.
Also Read: విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!
శివమ్ దూబే విధ్వంసం
చివర్లో శివమ్ దూబే నెదర్లాండ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 31 బంతుల్లోనే 66 పరుగులు బాదాడు. అతని ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 6 కళ్లు చెదిరే సిక్సర్లు ఉన్నాయి. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్ 3 వికెట్లు పడగొట్టగా, ఆర్యన్ దత్ 2 వికెట్లు తీశాడు.
నెదర్లాండ్స్ బ్యాటింగ్ ఇలా సాగింది
194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టుకు సాధారణ ఆరంభం లభించింది. ఆ జట్టు బ్యాటర్లు భారత బౌలింగ్ను ధీటుగా ఎదుర్కోలేకపోయారు. మైఖేల్ లెవిట్ 23 బంతుల్లో 24 పరుగులు చేశాడు. మాక్స్ ఓ’డౌడ్ 18 బంతుల్లో 20 పరుగులు చేశాడు. బాస్ డి లీడే జట్టులో అత్యధికంగా 21 బంతుల్లో 33 పరుగులు చేశాడు. కోలిన్ అకెర్మన్ 15 బంతుల్లో 23 పరుగులు జోడించాడు. మొత్తానికి భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నెదర్లాండ్స్ లక్ష్యానికి 17 పరుగుల దూరంలో ఆగిపోయింది.
