Asia Cup 2023: మళ్ళీ పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ బెదిరింపులు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా మరోసారి బెదిరింపు వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Publish Date - December 3, 2022 / 02:27 PM IST

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా మరోసారి బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆతిథ్యమిస్తున్న వచ్చే ఆసియా కప్ వేదికను మారిస్తే టోర్నీ నుంచి తాము వైదొలుగాతమని వ్యాఖ్యానించారు. ఆతిథ్య హక్కుల విషయంలో రాజీ పడేది లేదంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. తమకు ఆతిథ్య హక్కులు ఇవ్వకపోతే.. ఇవ్వమని తాము కోరుకోవడం లేదనీ. ఆ హక్కులను మాకు మేము పారదర్శకంగా తెచ్చుకున్నామన్నారు. భారత్ రాకపోతే అది వారి ఇష్టమనీ, దీని కోసం పాక్ నుంచి వేదికను మరోక చోటుకు మారిస్తే మాత్రం ఆసియా కప్ నుంచి తామే తప్పుకుంటామని స్పష్టం చేశారు.

వచ్చే ఏడాది ఆసియాకప్ పాక్ లో జరగనుంది. అయితే పాక్ తో ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు భారత్ సిద్ధంగా లేదు. దీంతో భారత్ ను ఎలాగైనా పాక్ రప్పించేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. గత నెలలో కూడా ఇదే అంశంపై కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్ కోసం వచ్చి ఆడితేనే.. భారత్ లో జరగనున్న వరల్డ్ కప్‌లో తాము ఆడతామనీ, ఒకవేళ రాకుంటే.. పాకిస్థాన్ లేకుండా 2023 ప్రపంచకప్ జరుగుతుందన్నాపు.

పాక్ లేకుండా ఎవరెవరు ఆడతారో తాము కూడా చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీనికి బీసీసీఐ కూడా ధీటుగా కౌంటర్ ఇచ్చింది. తమ ప్రభుత్వం అనుమతిస్తేనే పాక్ వస్తామని స్పష్టం చేసింది. 2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రవాదుల దాడి తర్వాత పాక్ లో చాలా ఏళ్ళు ఏ జట్టూ పర్యటించలేదు. గత కొంత కాలంగా జింబాబ్వే, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇప్పుడు ఇంగ్లాండ్ మాత్రం అక్కడ పర్యటించాయి. ప్రస్తుతం రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలపై భారత క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఏం చూసుకుని పాక్ క్రికెట్ బోర్డు ఇంతలా మిడిసిపడుతోందని ఫైర్ అవుతున్నారు.