Site icon HashtagU Telugu

ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్‌.. ఘోరంగా పతనమైన కోహ్లీ, రోహిత్

ICC Test Rankings

ICC Test Rankings

ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌ లో (ICC Test Rankings) టీమిండియా భారీగా నష్టపోయింది. కెప్టెన్ రోహిత్‌ శర్మ ఏకంగా ఆరు స్థానాలు దిగజారి 31వ స్థానానికి పడిపోయాడు. కనీసం టాప్ థర్టీలో కూడా లేకపోవడం ద్వారా రోహిత్ ప్రదర్శనపై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు ఆరేళ్ల తర్వాత తొలిసారి రోహిత్ టెస్ట్ ర్యాంకింగ్స్​లో టాప్ 30 జాబితాలో చోటు కోల్పోయాడు. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐదు స్థానాలు దిగజారి 20వ ర్యాంకులో నిలిచాడు.

ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ హ్యారీ బ్రూక్‌ జో రూట్‌ నుంచి నంబర్‌-1 స్థానాన్ని లాక్కున్నాడు. సో జో రూట్ 2వ స్థానానికి పరిమితమయ్యాడు. గత వారం న్యూజిలాండ్‌పై సెంచరీ చేయడం ద్వారా హ్యారీ బ్రూక్ లాభపడ్డాడు. రూట్‌కు 897 రేటింగ్ పాయింట్లు కాగా, హ్యారీ బ్రూక్ 898 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మూడో స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్ 812 రేటింగ్‌తో ఉన్నాడు. యశస్వి జైస్వాల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ట్రావిస్ హెడ్ ఆరు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకకు చెందిన కమిందు మెండిస్ ఒక స్థానం పైకెగసి ఆరో స్థానంలో నిలిచాడు. టెంబా బావుమా మూడు స్థానాలు ఎగబాకగా, న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ , రిషబ్ పంత్ మూడు స్థానాలు కోల్పోయారు. ఈ ర్యాంకింగ్స్ లో తెలుగు తేజం నితీశ్ కుమార్‌ రెడ్డి ఆరు స్థానాలు ఎగబాకి 69వ ర్యాంకును దక్కించుకున్నాడు.

Also Read: YS Jagan Assets Case: జగన్ ఆస్తుల కేసులో కీల‌క ప‌రిణామం.. సుప్రీంకోర్టు చేతికి కీలక నివేదిక..

ఐసిసి టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా 890 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అతని తర్వాత దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడ 856 పాయింట్లతో రెండో స్థానం, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ 851 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 415 రేటింగ్ పాయింట్లతో జడేజా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ 285 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతుంది. 5 మ్యాచుల టెస్ట్ సిరీస్లో మొదటి టెస్ట్​లో టీమ్ ఇండియా విజయం సాధించగా, రెండో మ్యాచ్​లో ఆసీస్​ గెలుపొందింది. ఇక మూడో టెస్టు గబ్బా స్టేడియం వేదికగా డిసెంబరు 14న మొదలు కానుంది.