CWG Hockey: సెమీస్ లో భారత మహిళల హాకీ జట్టు

కామన్‌వెల్త్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు అదరగొడుతోంది. కీలక మ్యాచ్ లో గెలిచి పతకం దిశగా అడుగులు వేస్తోంది.

  • Written By:
  • Publish Date - August 3, 2022 / 11:54 PM IST

కామన్‌వెల్త్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు అదరగొడుతోంది. కీలక మ్యాచ్ లో గెలిచి పతకం దిశగా అడుగులు వేస్తోంది. క్వార్టర్ ఫైనల్‌లో భారత అమ్మాయిలు కెనడాపై 3-2 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్లో అడుగుపెట్టారు. ఈ విజయంతో భారత్‌ ఆరు పాయిం‍ట్లతో గ్రూప్‌-ఏలో రెండో స్థానంలో నిలిచింది. భారత్ గ్రూప్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించింది.

తొలి మ్యాచ్‌లో ఘనాపై 5-0 తేడాతో గ్రాండ్‌ విక్టరీ సాధించిన భారత్‌.. ఆతర్వాతి మ్యాచ్‌లో వేల్స్‌పై 3-1 తేడాతో గెలుపొం‍దింది. అయితే ఇంగ్లండ్‌తో తదుపరి జరిగిన మ్యాచ్‌లో 1-3 తేడాతో ఓటమిపాలవ్వడంతో భారత జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. అనంతరం కెనడాతో మ్యాచ్‌లో పుంజుకున్న భారత అమ్మాయిలు.. అద్భుతంగా రాణించి సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకున్నారు. సలీమా టెటె, నవనీత్‌ కౌర్‌, లాల్రెమ్సియామి తలో గోల్‌ సాధించారు.

ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. భారత హాకీ ప్లేయర్లలో సలైమా 3వ నిమిషంలోనే గోల్ చేయగా నవ్నీత్ కౌర్ 22వ నిమిషంలో గోల చేసి భారత ఆధిక్యాన్ని 2-0కు పెంచింది. అయితే అదే సమయంలో కెనడా కూడా పుంజుకుంది. ఆట 23వ నిమిషంలో బ్రియాన్ స్టేర్స్ గోల్ కొట్టగా.. 39వ నిమిషంలో హన్నా గోల్ చేసింది. ఇక ఆట చివరి క్వార్టర్ హోరాహోరీగా సాగింది. 51వ నిమిషంలో సంగీత కుమారి గోల్ కొట్టడంతో భారత్ విజయం సాధించింది.
ఈ విజయంతో భారత్‌.. కెనడాతో సమానంగా ఆరు పాయింట్లు సాధించినప్పటికీ, ఎక్కువ గోల్స్‌ చేసిన కారణంగా కెనడా గ్రూప్‌-ఏలో అగ్ర జట్టు హోదాలో సెమీస్‌లో అడుగుపెట్టింది.