Highest Total: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మొదట బ్యాటింగ్ చేసి 240 పరుగులు చేసింది. వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేసి బెంగళూరు సరికొత్త చరిత్ర సృష్టించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్ ముగ్గురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు సాధించారు. విరాట్ 50 పరుగులు చేశాడు. ఇది కోహ్లీ ఐపీఎల్ కెరీర్లో 65వ అర్ధశతకం.
RCB చరిత్ర సృష్టించింది
ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 240 పరుగులు చేసింది. ఐపీఎల్లో వాంఖడే స్టేడియంలో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు. బెంగళూరు తన పాత రికార్డును తానే అధిగమించి ఈ ఘనత సాధించింది. 2015లో ఇదే మైదానంలో బెంగళూరు 235 పరుగులు చేసింది. ఇది 11 ఏళ్ల పాటు వాంఖడేలో ఐపీఎల్ అత్యధిక స్కోరుగా నిలిచింది. కానీ ఇప్పుడు ఆ రికార్డును RCB ధ్వంసం చేసింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ 234 పరుగులతో మూడో స్థానంలో ఉంది.
Also Read: Bio-Gas Project : సిద్దిపేటలో బయో-గ్యాస్ ప్రాజెక్ట్ ప్రారంభం
వాంఖడేలో అత్యధిక స్కోర్లు
- 240 పరుగులు – RCB (ముంబైపై) – 2026
- 235 పరుగులు – RCB (ముంబైపై) – 2015
- 234 పరుగులు – MI (ఢిల్లీపై) – 2024
- 230 పరుగులు – PBKS (ముంబైపై) – 2017
ముంబై బౌలింగ్ కకావికలం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ పవర్ప్లేలోనే 71 పరుగులు రాబట్టారు. విరాట్, సాల్ట్ మధ్య 120 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొంది. సాల్ట్ 36 బంతుల్లో 78 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 6 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ రజత్ పాటిదార్ క్రీజులోకి రాగానే విధ్వంసం సృష్టించి, కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇది RCB తరపున రెండో వేగవంతమైన ఫిఫ్టీ. అతను 20 బంతుల్లో 53 పరుగులు చేశాడు.
మరోవైపు విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 50 పరుగులు చేశాడు. డెత్ ఓవర్లలో టిమ్ డేవిడ్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ 16 బంతుల్లో 34 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి బెంగళూరును 240 పరుగుల చారిత్రాత్మక స్కోరుకు చేర్చాడు.
